క్లబ్ లు, పబ్ లు, బార్ ల్లో లిక్కర్ సేల్స్ కు ఓకే, రూ. 767 కోట్లు లాభం, ఆంధ్రా దెబ్బకు ఆధార్ కార్డు
బెంగళూరు: లాక్ డౌన్ సందర్బంగా ఇంత కాలం లిక్కర్ కోసం వెంపర్లాడిన తాగుబోతులకు ఇప్పుడు వైన్ షాప్ లో మద్యం చిక్కుతోంది. అయితే ఇన్ని రోజులు బార్ అండ్ రెస్టారెంట్ లు, పబ్ లు, క్లబ్ లు, విలాసవంతమైన హోటల్స్, లాడ్జ్ ల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాగేవాడు ఎలాగూ తాగుతున్నాడు, ఇక కొన్ని విషయాల్లో ఆంక్షలు ఎందుకు ? అనుకున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక ముందు క్లబ్ లు, పబ్ లు, బార్ లు, లాడ్జ్ లు, హోటల్స్ లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే లిక్కర్ స్టాక్ ఉన్నంత వరకు MRP రేట్లకు మాత్రమే మద్యం విక్రయించాలని, ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే మీ లైసెన్స్ లు రద్దు చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఐదు రోజుల్లో ప్రభుత్వానికి రూ. 767 కోట్ల లాభం వచ్చిందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలకు రెక్కలు రావడంతో పక్క రాష్ట్రంలో మందు కావాలంటే ఆధార్ కార్డు అడుగుతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంత వరకు మాకు వ్యాపారాలు లేవు, ఇప్పుడు లిక్కర్ విక్రయించడానికి మీరు అనుమతి ఇచ్చారు కదా, తరువాత కథ తరువాత చూద్దాం అంటున్నారు కొందరు లిక్కర్ వ్యాపారులు.
Recommended Video
Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !
టైం ఫిక్స్, గీత దాటితే గోవింద !
మూడో విడత లాక్ డౌన్ పొడగించిన తరువాత కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సడలింపుల్లో భాగంగా ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఇక కర్ణాటకలో మద్యం విక్రయాలు మంచి ఊపు మీద ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల లోపు రాత్రి 7 గంటల పైన మద్యం విక్రయిస్తే లైసెన్స్ లు రద్దు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.
క్లబ్ లు, పబ్ లు, బార్ లు, లాడ్జ్ లో లిక్కర్ సేల్స్
నిన్నటి వరకు వైన్ షాప్ లు, ప్రభుత్వ మద్యం దుకాణాలు, MRP లిక్కర్ షాపుల్లో మాత్రమే మందు విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి హెచ్. నాగేష్ మీడియాతో మాట్లాడారు. ఇక ముందు క్లబ్ లు, పబ్ లు, బార్ లు, లాడ్జ్ లో మద్యం విక్రయించడానికి సీఎం యడియూరప్ప అనుమతి ఇచ్చారని మంత్రి నాగేష్ అన్నారు. అయితే స్టాక్ ఉన్నంత వరకు MRP ధరలకు మాత్రమే మద్యం విక్రయించాలని, ఎక్కువ ధరకు విక్రయిస్తే వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని మంత్రి నాగేష్ హెచ్చరించారు. క్లబ్ లు, పబ్ లు, బార్ లు, లాడ్జ్ ల్లో మద్యం సేవించడానికి అవకాశం లేదని, పార్శిల్ మాత్రమే ఇవ్వాలని సూచించామని మంత్రి నాగేష్ వివరించారు.
అబ్బా.... రూ. 767 కోట్లు లాభం
లాక్ డౌన్ సడలించిన తరువాత మద్యం షాప్ లు తియ్యడం వలన ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ. 767 కోట్ల ఆధాయం వచ్చిందని కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి హెచ్. నాగేష్ చెప్పారు. ఐదు రోజుల్లో రూ. 121 కోట్లు పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆధాయం వచ్చిందని మంత్రి నాగేష్ వివరించారు. వారం రోజుల్లో రూ. వెయ్యి కోట్ల ఆధాయం వస్తుందని అంచానా వేస్తున్నామని మంత్రి నాగేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రా దెబ్బకు ఆధార్ కార్డు
కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు) ఎవరికైనా మద్యం విక్రయించాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు చూసి ఇవ్వాలని అన్ని వైన్ షాపుల యజమానులకు సూచించామని మంత్రి నాగేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ధరకు మద్యం విక్రయించడంతో అక్కడి ప్రజలు కర్ణాటక సరిహద్దుల్లోని మద్యం షాప్ ల దగ్గరకు క్యూ కడుతున్నారు. ఈ విషయాలు అన్ని గమనించిన తరువాత కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక సరిహద్దుల్లో మద్యం కొనుగోలు చెయ్యానికి వచ్చేవారి ఆధార్ కార్డులు పరిశీలించి మద్యం విక్రయించాలని షరతులు పెట్టిందని తెలిసింది.
రూ. 55 వేల బిల్లు కేసు ఏమైందంటే ?
బెంగళూరులో ఒక వ్యక్తి ఒకే సారి రూ. 55 వేల విలువైన మద్యం కొనుగోలు చేశాడని నమోదైన కేసు విచారణలో ఉందని, ఆ కేసు దర్యాప్తు నివేదిక వచ్చిన తరువాత ఆ వ్యక్తి మీద, వైన్ షాప్ యజమాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి నాగేష్ వివరించారు.
టార్గెట్ రూ. 2,500 కోట్లు లాభం
కర్ణాటకలో ఒక్కొక్కరికి 2.3 లీటర్ల మద్యం విక్రయించడానికి అనుమతి ఇచ్చామని, ఈ నియమాలను అన్ని వైన్ షాప్ ల యజమానులు పాటించాలని మంత్రి నాగేష్ చెప్పారు. మద్యం విక్రయాల వలన రూ. 1, 200 కోట్లు ఆదాయం వస్తుందని తెలుస్తోందని, అయితే మా టార్గెట్ రూ. 2, 500 కోట్లు ఉందని మంత్రి నాగేష్ వివరించారు.
గోడ మీద దీపం పెట్టిన 6 రాష్ట్రాలు
కర్ణాటకలోని వలస కార్మికులను తరలించడానికి 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు బుక్ చేశామని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి నాగేష్ వివరించారు. మొత్తం 11 రాష్ట్రాల ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేశామని, ఇప్పటికి ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, మిగిలిన ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు వలస కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి నాగేష్ వివరించారు. మొత్తం మీద కర్ణాటకలో లిక్కర్ వ్యాపారం వలన భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆధాయం వస్తుందని మంత్రి నాగేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.