కరోనా వైరస్: లాక్డౌన్ మరో 5 నెలలు?.. షాకింగ్ రిపోర్ట్.. ఇచ్చిందెవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా కొత్త నగరాన్ని నిర్మించడం కంటే.. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీని రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని, అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. పరిపాలనను మూడు ప్రాంతాల్లో వికేంద్రీకరించాలంటూ వైసీపీ సర్కారుకు నివేదించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ అమెరికన్ అధ్యయన సంస్థ దేశంలో లాక్ డౌన్ పరిస్థితులపైనా సంచలన రిపోర్టును వెల్లడించింది.
Recommended Video
లాక్ డౌన్ పై అధ్యయనం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. 21 రోజుల పాటు, అంటే, ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాతి కాలంలోనే కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు కావడంతో దాన్ని మరింత కాలం పొడిగించే వీలున్నట్లు వార్తలు వచ్చాయి. సదరు వార్తల్ని ఫేక్ న్యూస్ గా కేంద్రం కొట్టిపారేసింది. అయితే గతంలో వచ్చిన వార్తలన్నీ గాలివాటంగా రాసినవి కావడం వల్లే అలా జరిగింది. ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాంటి పేరెన్నికగల సంస్థ శాస్త్రీయంగా అధ్యయనం తర్వాత రిపోర్టును బహిర్గతం చేసింది.
సెప్టెంబర్ దాకా..
కరోనాకు సంబంధిచి దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నపరిస్థితి దృష్ట్యా తక్కువలో తక్కువ జూన్ రెండో వారం దాకా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నట్లు బీసీజీ తెలిపింది. ఎక్కువలో ఎక్కువ సెప్టెంబర్ రెండో వారం దాకా కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంది. నిజానికి.. ఇప్పుడు వినిపిస్తున్న వాదనల్లో ఎక్కడా లాక్ డౌన్ ఇంత సుదీర్ఘకాలం కొనసాగొచ్చనే అంచనాలు లేవు. వైరస్ పుట్టిన చైనాలో కూడా రెండు నెలలు మాత్రమే విధించారు. అలాంటిది బోస్టన్ అంచనాలు మాత్రం ఇండియాలో ఏకంగా ఆరు నెలలు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పడం విచిత్రంగా అనిపించకమానదు. అయితే దీనికి కారణాలను కూడా ఆ సంస్థ వివరించింది..
ఎందుకంటే..
లాక్ డౌన్ ప్రకటన కంటే.. దాన్ని ముగించే ప్రక్రియ మరింత కఠినతరమైనదని బీసీజీ చెప్పింది. లాక్ డౌన్ తర్వాత కూడా కరోనా ప్రభావం కొనసాగితే.. వైరస్ ను నియంత్రించేందుకు సన్నద్ధం కావడం దేశ ఆరోగ్య రంగానికి పెద్ద సవాలు అవుతుందని పేర్కొంది. అధికజనాభా ఉన్న భారత్ లో ప్రిపరేషన్ లేకుండా, వైరస్ ప్రభావం తగ్గకముందే లాక్ డౌన్ ఎత్తివేత ఇబ్బందికరంగా మారొచ్చని బీసీజీ అభిప్రాయపడింది.
అగ్రరాజ్యాలే వణుకుతుండగా..
లాక్ డౌన్ సెప్టెంబర్ దాకా కొనసాగొచ్చన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పలు ప్రముఖ వెబ్ సైట్లలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, యూరప్ లో అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా ధాటికి వణికిపోతుండటం, అక్కడ వేల సంఖ్యలో మరణాలు సంభవించడంతోపాటు, పాజిటివ్ కేసులు లక్షల్లో రికార్డు కావడం.. మిగతా దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నది. చైనాలో వైరస్ పుట్టిన హుబే ఫ్రావిన్స్ లో లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత కూడా సుమారు 25 వేల వైద్య బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. అయినాకూడా కొత్తగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అసింప్టమాటిక్(రోగ లక్షణాలు బయటికి కనబడని పాజిటివ్) కేసుల సంఖ్య గణీయంగా పెరుగుతున్నది. వీటన్నింటి దృష్ట్యా లాక్ డౌన్ కొనసాగింపు సబబేనని కొందరు అభిప్రాయపడగా, అంత సుదీర్ఘకాలం దాన్ని భరించే శక్తి దేశానికి లేదని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం అధికారికంగా వెల్లడించేదాకా ఏ విషయాన్నీ నమ్మడానికి వీల్లేదు.
ఒక్కరోజే 478 కేసులు..
శనివారం ఉదయం వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3108గా నమోదైంది. మొత్తం 86 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలోనే 478 కొత్త కేసులు వెలుగులోకి రావడం గమనార్హం. ఇవాళ బయటపడిన కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ తో సంబంధం ఉన్నవే కావడం విశేషం. ఏపీలో ప్రస్తుతం 164 కేసులుండగా, తెలంగాణలో ఒకేరోజు 75 కొత్త కేసులు రావడంతో సంఖ్య 229కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు 11లక్షలు దాటగా... మరణాల సంఖ్య 60 వేలకు దగ్గరగా ఉంది.