కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..
ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి నయంకాగా, 652 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో 1486 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరలేదని, దాన్ని నివారించేందుకే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం పదేపదే చెబుతున్నది. ఈ నేపథ్యంలో రెండో దశ లాక్ డౌన్ ను కూడా మూడో దశకు పొడగిస్తారనే రిపోర్టులు వస్తున్నాయి.
ఏం చేద్దాం?
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపు అసాధ్యంగా కనిపిస్తున్నది. కానీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా మరికొంతకాలం లాక్ డౌన్ తప్పదనీ రిపోర్టులు వస్తున్నాయి. కఠినమైన సవాళ్లతో కూడుకున్న ఈ నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నారు. అలాగే, లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన వ్యవస్థల్ని తిరిగి రీఓపెనింగ్ చేసే దిశగానూ అడుగులు వేస్తున్నారు. వాటికి సంబంధించిన మార్గాలు అణ్వేషించే పనిపై ఆయన దృష్టి సారించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు.
27న మళ్లీ..
దేశవ్యాప్త లాక్ డౌన్ విధించి నెల రోజులు పూర్తికావస్తున్న దరమిలా ప్రధాని మోదీ.. మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఆయన సీఎంలతో రెండు సార్లు సమాలోచనలు జరిపారు. కాగా, 27న(సోమవారం) జరగబోయే భేటీ దేశభవిష్యత్తుకు కీలకం కానుంది. అదే సమావేశంలో లాక్ డౌన్ కు సంబంధించి కచ్చితమైన నిర్ణయం తీసుకునే వీలుందని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో నిషేధాలు కొనసాగిస్తూ, మిగతా చోట్ల ఈజ్ చేయాలన్న కేంద్రం భావనకు ముఖ్యమంత్రులు మద్దతిస్తారో లేదో వేచిచూడాలి. ఇకపోతే..
మోదీ మొండిచేయి..
లాక్ డౌన్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేలా రూ.20వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించబోతున్నట్లు బుధవారం ఉదయం నుంచి భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రధాని నేతృత్వంలో జరిగే కేంద్ర కేబినెట్ భేటీలోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని ప్రచారం జరిగింది. అలాగే మిగతా రంగాలకూ వర్తించేలా, రాష్ట్రాలకు మేలు చేకూర్చే మరో ఆర్థిక ప్యాకేజీని కూడా వెల్లడించే అవకాశాలున్నట్లు జాతీయ మీడియా కోడైకూసింది. తీరాచూస్తే, వైద్య సిబ్బందిపై దాడుల నియంత్రణకు ఆర్డినెన్స్, కరోనా యోధులకు ఇన్సురెన్స్ తప్ప ఆర్థిక ప్యాకేజీల ముచ్చట లేకుండానే మంత్రి జవదేకర్ బ్రీఫింగ్ ముగిసింది. దీంతో ప్యాకేజీపై ఆశలు పెట్టుకున్న పారిశ్రామ వర్గాలు, రాష్ట్రాలకు మోదీ మొండిచేయి చూపించినట్లయింది.
Recommended Video
వైరస్ నియంత్రణ ఎలా?
ప్రపంచ దేశాలతో పోల్చుంకుంటే ఇండియాలో కొవిడ్-19 పేషెంట్ల రికవరీ రేటు గణనీయంగా ఉండటం ఊరటనిచ్చే అంశమన్న కేంద్ర ఆరోగ్య శాఖ.. కేసుల ఉధృతిపై మాత్రం సీరియస్ హెచ్చరికలే చేస్తున్నది. పేషెంట్ల గుర్తింపులో కీలకమైన టెస్టింగ్స్ ప్రక్రియకు రెండ్రోజులు బ్రేక్ పడటం ఇబ్బందికర పరిణామంలా మారింది. సౌత్ కొరియా, చైనా నుంచి తెప్పించిన యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ 6శాతంలోపే కచ్చితత్వాన్ని చూపుతున్నాయని ఫిర్యాదు రావడంతో వాటి వాడకాన్ని ఐసీఎంఆర్ నిలిపేసింది. ఒకటి రెండు రోజుల్లో దానిపై క్లారిటీ వస్తుంది. టెస్టుల సంఖ్య పెంచడంతోపాటు వైరస్ ప్రబలకుండా చేయాలన్నది కూడా మోదీ సర్కారు అభిమతం. కాకుంటే, అందుకోసం లాక్ డౌన్ ను మళ్లీ పొడిగిస్తారా? లేక మధ్యలో విరామం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.