Coronavirus Lockdown: నిన్న ఢిల్లీ తబ్లీగ్ జమాత్, నేడు కేరళ చర్చిలో ప్రార్థనలు, కేసు !
తిరువనంతపురం: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసినా కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కాకపోవడంతో రెండో విడత లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడగించారు. దేశం మొత్తం అన్ని మతాలకు చెందిన జాతరలు, ఊరేగింపులు, సామూహిక ప్రార్థనలు, ఉరుసులు నిర్వహించకూడదని నిషేధం విధించారు. అయినా అధికారుల కళ్లు కప్పి ఎక్కడో అక్కడ సామూహిక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ సమావేశాల దెబ్బకు కరోనా వైరస్ తాండవం చేసిందనే విషయం మరవకముందే కేరళలోని చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారని వెలుగు చూసింది. చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించిన చర్చి ఫాదర్ తో సహ ఆ ప్రార్థనా మందిరం కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
Coronavirus: సిలికాన్ సిటీలో 38 వార్డులు కరోనా హాట్ స్పాట్స్; ఒక్కడి దెబ్బకు 50 మందికి వైరస్ !
ప్రభుత్వాలు ఎంత చేస్తున్నా ?
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడికి ఇంత చేస్తున్నా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పలు చోట్ల మత ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయని వెలుగు చూస్తోంది.
తబ్లీగ్ జమాత్ దెబ్బ
ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ సమావేశానికి హాజరైన వారు భారతేశం మొత్తం సంచరించడంతో కరోనా వైరస్ అనేక మందికి వ్యాపించింది. ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ దెబ్బకు దేశ ప్రజలు హడలిపోయారు. దేశంలోని 63 శాతం కరోనా వైరస్ కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యకర్తల నుంచి వ్యాపించాయని ఆరోపణలు ఉన్నాయి.
కేరళ చర్చిలో ప్రార్థనలు
కేరళలోని కొచ్చి సముద్ర తీరంలోని స్టెల్లా మోరీస్ చర్చిలో సామూహిక ప్రార్థనలు జరిగాయని సమాచారం. స్టెల్లా మోరీస్ చర్చిలో సామూహిక ప్రార్థనలు జరిగాయని సమాచారం తెలుసుకున్న స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో చర్చిలో సామూహిక ప్రార్థనలు జరిగాయని వెలుగు చూసింది.
కేసు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు
కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నియమాలతో పాటు కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించిన స్టెల్లా మోరీస్ చర్చి ఫాదర్ అగస్టిన్ పలయల్ తోపా ఆ చర్చి కమిటీ సభ్యులు 7 మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన చర్చి ఫాదర్ తో పాటు మరో 7 మందిని బెయిల్ పై విడుదల చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ నియమాలు, కేంద్ర, కేరళ ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి ఎవరైనా సామూహిక ప్రార్థనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.