Coronavirus: ఒకే ఇంట్లో మకాం వేసిన 9 మంది తబ్లీగ్ జమాత్ మౌల్వీలు, కరోనా క్వారంటైన్!
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. కంటికి కనపడని కరోనా కారణంగా ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇదే సమయంలో భారత్ లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనాను అరికట్టడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. కరోనాను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాపించడానికి ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమం ప్రధాన కారణం అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా తబ్లీగ్ జమాత్ కార్యకర్తలు కరోనా వైరస్ బారినపడ్డారని స్పష్టంగా వెలుగు చూసింది. ఇదే సమయంలో కర్ణాటకలోని వీరాజ్ పేట్ లో తబ్లీగ్ జమాత్ మౌల్వీలు 9 మందిని అదుపులోకి తీసుకుని వారిని క్వారంటైన్ కు తరలించామని జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ పన్నేకర్ తెలిపారు.
Lockdown: ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం, ఫ్రెండ్స్ తో జాలీరైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్?!
ఢిల్లీ దెబ్బకు విలవిల
గత నెల దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగ్ జమాత్ కార్యక్రమాలకు దేశంలోని 23 రాష్ట్రాలతో పాటు నాలుగు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ఓ వర్గం వారితో పాటు విదేశాలకు చెందిన వారు హాజరైనారు. తబ్లీగ్ జమాత్ కార్యక్రమాలకు హాజరైన వారు దేశంలోని ఇతర ప్రాంతాల్లో సంచరించడంతో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి వ్యాపించదని అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ దెబ్బకు దేశం కరోనా వైరస్ భయంతో విలవిలలాడుతోంది.
దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు?
ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమాలకు హాజరైన తరువాత అన్ని రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఓ వర్గం వారు ఎక్కడెక్కడ ఉన్నారు ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమాలకు హాజరైన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పదేపదే మనవి చేస్తున్నాయి.
ఒకే చోట గుంపుగా మౌల్వీలు
కర్ణాటకలోని కొడుగు జిల్లా వీరాజ్ పేట్ లో తబ్లీగ్ జమాత్ కు చెందిన 9 మంది మౌల్వీలను ఒకే ఇంటిలో గుర్తించారు. ఫిబ్రవరి 2వ తేదీన వీరాజ్ పేట్ కు చేరుకున్న మౌల్వీలు తరువాత జరిగిన 40 రోజుల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గోన్నారు. తరువాత దేశంలో లాక్ డౌన్ అమలులోకి రావడంతో ఈ మౌల్వీలు అందరూ వీరాజ్ పేట్ లోనే చిక్కుకుపోయారని కొడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ పడ్నేకర్ అన్నారు.
ఇంటి యజమాని, మౌల్వీలకు కరోనా పరీక్షలు!
వీరాజ్ పేట్ లో 9 మంది మౌల్వీలు నివాసం ఉండటానికి ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానిని క్వారంటైన్ కు తరలించారు. గుజరాత్ కు చెందిన 9 మంది మౌల్వీలు ముంబైలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశాలకు హాజరైనారని, అక్కడ సమావేశాలు పూర్తి అయిన తరువాత ముంబై నుంచి వీరాజ్ పేట్ చేరుకున్నారని కొడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ పన్నేకర్ మీడియాకు చెప్పారు. 9 మంది మౌల్వీలు, వారు నివాసం ఉంటున్న ఇంటి యజమానికి కరోనా వైరస్ వైద్యపరీక్షలు నిర్వహించి అందర్నీ క్వారంటైన్ లకు తరలించామని, వీరి గురించి జిల్లా పోలీసులు సమగ్ర నివేదిక తయారు చేస్తున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ పన్నేకర్ మీడియాకు చెప్పారు.