కరోనా విలయం: దేశానికి ఊహించని దెబ్బ.. నీతి ఆయోగ్ బిల్డింగ్ సీజ్..
దేశానికి ప్రధానమంత్రి కార్యాలయం గుండె లాంటిదైదే, అభివృద్ది విధానాలు రూపొందించే 'నీతి ఆయోగ్' మెదడు లాంటిదని తెలిసిందే. కరోనా విలయకాలంలో కేంద్ర, రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలిస్తోన్న ఆ థింక్ ట్యాంక్ ఇప్పుడు సడెన్ గా మూతపడింది. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ చర్చలు ఊపందుకున్న కీలక సమయంలో అక్కడి అధికారులు, సిబ్బంది క్వారంటైన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ ఒక్కడితో..
నీతి ఆయోగ్ లో పనిచేస్తోన్న ఓ అధికారి వైరస్ కాటుకు గురయ్యారు. లక్షణాలు బయటపడటానికి కొద్ది గంటల ముందు వరకూ ఆయన ఆఫీసులో పనిచేశారు. నీతి ఆయోగ్ చైర్మన్, ప్లానింగ్ శాఖకు బాధ్యుడైన ప్రధాని నరేంద్ర మోదీకి విషయాన్ని చేరవేసిన ఉన్నతాధికారులు.. బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రొటోకాల్స్ ప్రకారం నీతి ఆయోగ్ భవంతిని 48 గంటలపాటు మూసేసి, క్రిమిసంహారక మందులు పిచికారి చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. వైరస్ సోకిన అధికారిని ఐసోలేషన్ కు తరలించగా, బిల్డింగ్ లో పనిచేస్తోన్న మిగతావాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచారు.
సర్వేకు సిద్ధమవుతోన్న వేళ..
కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు మే 3తో ముగియనుండటంతో ఎగ్జిట్ స్ట్రాటజీపై నీతి ఆయోగ్ దృష్టిసారించింది. సోమవారం ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లోనూ నీతి ఆయోగ్ ప్రస్తావన పదేపదే వచ్చింది. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో రెడ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ కొనసాగించాల్సి ఉంటుందన్న నీతి ఆయోగ్ సూచనను మోదీ.. సీఎంలకు వివరించారు. మే 3 తర్వాత ఆయా జిల్లాల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విషయమై సర్వే చేపట్టేందుకు సంస్థ సిద్ధమైంది.
Recommended Video
పాల్ ప్రెజెంటేషన్..
దేశంలో మొత్తం 736 జిల్లాలుంటే, అందులో 400 జిల్లాల్లో కరోనా ఎఫెక్ట్ లేదని, జీవితాలను కాపాడటంతోపాటు ప్రజలు జీవనోపాధి కోల్పోకుండా చూడటం అతి ప్రధానమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన రాజీవ్ కుమార్ గతంలో చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్.. కరోనాపై కీలక ప్రెజెంటేషన్ ఇచ్చారు. డేటా అనలైజింగ్ కంపెనీలతో కలిసి నీతి ఆయోగ్ చేసిన అధ్యయనంలో.. మే మొదటి వారంలో ఇండియాలో కేసులు పీక్ దశకు చేరుతాయని, మే 16 నుంచి వైరస్ ప్రభావం తగ్గుతుందని వెల్లడైనట్లు పాల్ చెప్పారు. ఆ మేరకు మే 3 తర్వాత కేవలం రెడ్ జోన్లలోనే లాక్ డౌన్ కొనసాగిస్తారా, మిగతా ప్రాంతాలకు కూడా వర్తింపజేస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది.