coronavirus: మమ్మీ.. మమ్మీ... మూడేళ్ల చిన్నారికి దూరంగా తల్లి, 15 రోజులుగా ఆస్పత్రిలోనే, సీఎం హామీ.
కరోనా వైరస్ మహమ్మారి రోగుల జీవితాలను ఛిద్రం చేస్తోండగా.. వైద్య సిబ్బంది బంధాలపై ప్రభావం చూపుతోంది. ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. దీంతో వారి పిల్లలు తల్లిదండ్రులను మిస్ అవుతున్నారు. కర్ణాటకలో కూడా ఓ చిన్నారి తన తల్లిని 15 రోజుల నుంచి మిస్ అవుతోంది. గోల గోల చేసి.. చివరికి అమ్మ వద్దకు చేరింది. కానీ దూరం నుంచే చూసి.. అమ్మ అంటూ రోదించడం అక్కడున్న వారి గుండెలను కూడా పిండేసింది.
15 రోజులుగా ఆస్పత్రిలోనే..
కర్ణాటకలోని బెలగం జిల్లాలో బెలగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బిమ్స్) ఆస్పత్రి ఉంది. ఇక్కడ కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్ వార్డు రోగులతో నిండిపోయి ఉంది. ఇక్కడ సునంద కొర్పూర్ అనే నర్సు విధులను నిర్వహిస్తోంది. వైరస్ సోకిన ఐసోలేషన్ వార్డులో డ్యూటీ చేస్తుండటంతో 15 రోజులగా ఇంటికి వెళ్లలేకపోయింది. జిల్లాలో వైరస్ సోకి ఏడుగురు చనిపోవడంతో.. వైద్య సిబ్బందికి కూడా ఆస్పత్రిలోనే వసతి ఏర్పాటు చేశారు. రోగులకు రేయనక, పగలనక వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సునందకు పెళ్లి కాగా.. భర్త, మూడేళ్ల కూతురు ఐశ్వర్య ఉన్నారు. ఆ పాప తల్లిపై బెంగ పెట్టుకుంది.
తల్లిపై బెంగ..
సునంద ఇంటికి వెళ్లకపోవడంతో ఐశ్వర్య తల్లిని మిస్ అవుతోంది. తల్లిని చూడలేక ఉండలేకపోయింది. అమ్మను చూపించాలని నాన్న శ్రీకాంత్ వద్ద మారాం చేసింది. చిన్నారి గోల భరించలేక ఆ తండ్రి ఎలాగోలా మంగళవారం రోజున ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ ఏదో సర్దిచెప్పి తీసుకు రావొచ్చు అనుకొన్నాడు. కానీ సమస్య మరింత జఠిలమైంది. ఏడుపులు, పెడబొబ్బులతో ఆస్పత్రి దద్దరిల్లిపోయింది. అక్కడున్న వారు కూడా చిన్నారి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
క్యాంటిన్లో చిన్నారి..
ఐసోలేషన్ వార్డు వద్దకు వెళ్లేందుకు వీలుపడలేదు. దీంతో క్యాంటిన్లో శ్రీకాంత్ వేచి ఉన్నారు. మమ్మీ.. మమ్మీ... అని మారం చేసిన చిన్నారికి నచ్చజెప్పలేకపోయాడు ఆ తండ్రి. చివరికి క్యాంటిన్ వద్దకొచ్చింది. తల్లిని చూసి చిన్నారి దగ్గరికి తీసుకోవాలని కోరింది. కానీ ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆ తల్లి మనస్సు అంగీకరించలేదు. అడుగుదూరంలో ఉండి.. చిన్నారితో మాట్లాడింది. దగ్గరికి రావాలని పాప కోరడంతో.. ఏం చేయాలో, ఏం చెప్పాలో తెలియని ఆ తల్లి కంట్లోంచి వస్తోన్న నీరు ఆపి.. అటు తిప్పి గుక్కపట్టుకొని మరీ ఏడ్చారు. ఆమె వద్ద ఉన్న సమయంలో తినడానికి కూడా నిరాకరించిందని.. దీంతో తన బాధ వర్ణణాతీతం అని పేర్కొన్నది.
వీడియో వైరల్, సీఎం లేఖ
బెలగాం ఆస్పత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైరలైంది. వీడియో చూసిన సీఎం యడియూరప్ప స్పందించారు. సునందను పిలిపించి మాట్లాడటమే కాకుండా ఒక లేఖ కూడా రాశారు. అందులో ఆమె పడ్డ బాధను అర్థం చేసుకున్నానని వివరించారు. కఠిన సమయంలో విధుల పట్ల వైద్య సిబ్బంది చూపుతోన్న అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాలను ఫణంగా పెట్టి మరీ నిస్వార్థ్యంగా వైద్య సేవలు అందిస్తోన్న సిబ్బందిని మరచిపోమని యడియూరప్ప పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక.. సిబ్బంది సమస్యలపై దృష్టిసారిస్తామని.. తప్పకుండా పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.
Recommended Video