Coronavirus: ఇండిగో సంస్థ కీలక నిర్ణయం: చైనా రద్దీ రూట్లలో విమాన సర్వీసులు రద్దు..!
న్యూఢిల్లీ: చైనాను చుట్టుముట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం.. విమాన సర్వీసులపైనా పడింది. భారత్ నుంచి చైనాలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలను సాగించే ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ విషయాన్ని ఇండిగో విమానయాన సంస్థ యాజమాన్యం వెల్లడించింది. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.
Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!
న్యూఢిల్లీ నుంచి చెంగ్డు, బెంగళూరు నుంచి హాంగ్కాంగ్ మార్గంలో రాకపోకలను సాగించే తమ సంస్థకు చెందిన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసినట్లు తెలియజేసింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి దీన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ.. చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ రెండు మార్గాల్లో విమాన సర్వీసులను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించలేదు.
కాగా- కోల్కత నుంచి గ్వాంగ్ఝౌ మధ్య నడిచే విమాన సర్వీసులను ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించనున్నట్లు పేర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా కోల్కత-గ్వాంగ్ఝౌ మార్గంలో సర్వీసులను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా- చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఇండిగో విమానయాన సంస్థ బాటలోనే మరిన్ని సంస్థలు కూడా ప్రయాణించే అవకాశాలు లేకపోలేదు.