Coronavirus: ఎమ్మెల్యేకి పాజిటివ్, సీఎం పరుగో పరుగు, వేప చెట్ల కింద అసెంబ్లీ, దేశంలో తొలిసారి!
చెన్నై/ పుదుచ్చేరి: చెట్టుకింద ప్లీడర్ సినిమా మనందరికి చాలాబాగా గుర్తుంటుంది. చెట్టు కింద వ్యాపారాలు, లావాదేవీలు, సెటిల్ మెంట్ లు మనం చాలా చూశాము. అయితే దేశంలో తొలిసారి వేప చెట్టు కింద అసెంబ్లీ సమావేశం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరీలో వరుసగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అంతే ఒక్కసారిగా హడలిపోయిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వేప చెట్టుకింద పరుగు తీసి అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మమా అనిపించారు.
Coronavirus: కరోనా విరుగుడుకు పరిష్కారం ఓల్డ్ మంక్ రమ్, ఎగ్ ఫ్రై, గోమూత్రం, పాపడ్, సూర్యుడు!
బడ్జెట్ సమావేశాలు
కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరీలో ఈనెల 20వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరీ అసెంబ్లీలో వాడివేడిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి లేకుండానే అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేశారు. మరుసటి రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణేబేడి అసెంబ్లీలో ప్రత్యక్షం అయ్యి తన ప్రసంగాన్ని ముగించారు. ఇంత వరకు కథ సాఫీగా సాగిపోయింది.
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు కలవరం
శనివారం పుదుచ్చేరీ అసెంబ్లీలో అనేక ముసాయిదాలు, కొన్ని కీలక నిర్ణయాలపై అనుమతులకు ముందుగానే షెడ్యూల్ సిద్దం చేశారు. పుదుచ్చేరీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామితో పాటు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరైనారు. ఆ సమయంలో హఠాత్తుగా ఓ అధికారి పరిగెత్తుకుంటూ అసెంబ్లీలోకి వచ్చి సీఎం నారాయణస్వామి చెవిలో ఓ వార్త చెప్పారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యిందని ఆ అధికారి సీఎం చెవిలో చెప్పారు.
దేవుడా... చెట్ల కిందకు పరుగో పరుగు
ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే పుదుచ్చేరీ సీఎం నారాయణస్వామితో పాటు, మంత్రులు, అన్నిపార్టీల ఎమ్మెల్యేలు హడలిపోయారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలకు కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యే వచ్చి వెళ్లడంతో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే సీఎం నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీని ఖాళీ చేసి బయట ఉన్న చెట్లకిందకు పరుగున వచ్చారు.
వేప చెట్టుకింద మమా
అసెంబ్లీ సిబ్బంది ఆరుబయట అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరీ స్పీకర్ శివకొలుందు, సీఎం నారాయణస్వామి, మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు వేప చెట్టుకింద కుర్చుని రెండు గంటలపాటు చర్చించి వివిద ముసాయిదాలు, కీలక నిర్ణయాలు, జీతాలు, ఫించన్లు, సంక్షేమ పథకాల నిధుల కేటాయింపు తదితర విషయాల గురించి చర్చించి సమావేశాన్ని మమా అనిపించారు. అనంతరం పుదుచ్చేరీ అసెంబ్లీని పూర్తిగా శానిటైజ్ చేశారు.
Recommended Video
A to Z క్వారంటైన్
కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యే గురువారం వరకు అసెంబ్లీకి వచ్చిన సందర్బంలో సీఎం నారాయణస్వామితో పాటు, స్పీకర్ శివ, మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేని పుదుచ్చేరీలోని ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద కరోనా దెబ్బకు దేశంలో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు వేప చెట్టుకింద నిర్వహించిన పుదుచ్చేరీ సీఎం నారాయణస్వామి రికార్డు సృష్టించారు.