కరోనా: మే1 వరకు లాక్డౌన్ పొడగింపు.. వైరస్ లోకల్ వ్యాప్తి వల్లేనన్న కెప్టెన్.. కేంద్రం ఖండన
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్ డౌన్.. శుక్రవారంతో 17వ రోజుకు చేరింది. లాక్ డౌన్ ముగింపు గడువు మరో 4రోజులే ఉండటంతో కొనసాగింపు లేదా ఎత్తివేతపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాల నిపుణులతో చర్చించిన ప్రధాని నరేంద్ర మోదీ.. లాక్ డౌన్ పై ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిసింది. కానీ, కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకముందే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగింపునకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
చెప్పేసిన రెండు రాష్ట్రాలు..
కొన్ని గంటల కిందటే, ఒడిశాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామంటూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. తద్వారా లాక్ డౌన్ కొనసాగింపును ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఒడిశాలో ప్రస్తుతానికి కొవిడ్-19 కేసుల సంఖ్య 48కాగా, ఒకరు మరణించారు. ఒడిశా తర్వాత రెండో రాష్ట్రంగా పంజాబ్ సైతం లాక్ డౌన్ కొనసాగింపునకు సై అంది. మే 1 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామని అక్కడి కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. కాగా,
కెప్టెన్ సంచలన ప్రకటన
శుక్రవారం నాటికి పంజాబ్ లో 130 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 10 మంది చనిపోయారు. ఇతర రాష్ట్రాల మరణాల రేటుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. కరోనా ప్రభావంపై సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పంజాబ్ లో ప్రస్తుతం.. విదేశాల నుంచి వచ్చినవాళ్లు, ఎన్నారైల సంఖ్య 1.40లక్షలుగా ఉంది. వాళ్లలో వైరస్ సోకినవాళ్లను ప్రైమరీ కేసులుగా భావిస్తే, విదేశాల నుంచి వచ్చినవాళ్లతో కాంటాక్ట్ లేకుండానే మరో 27 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అంటే పంజాబ్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) జరుగుతున్నట్లుగానే భావించాలి. అందుకే లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తున్నాం''అని సీఎం తెలిపారు.
కేంద్రం ఖండన..
పంజాబ్ లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశకు వచ్చిందన్న సీఎం అమరిందర్ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పంజాబ్ సహా దేశంలో ఎక్కడా వైరస్ లోకల్ వ్యాప్తి లేదని, ఒకవేళ ఆ దశ వస్తే కచ్చితంగా అందరినీ అలర్ట్ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. నిజానికి గురువారం నాటి లెక్కలు కొంత ఆశాజనకంగా ఉన్నాయని, మొత్తం 16,002మందికి టెస్టులు చేయగా, అందులో కేవలం 2శాతం మందే కరోనా పాజిటివ్ అని తేలిందని అగర్వాల్ వివరించారు. దేశవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 6,412కు పెరిగింది. అందులో 503 మందికి వ్యాధి నయంకాగా, 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1364 కేసులు, 98 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే,
Recommended Video
మరికొన్ని రాష్ట్రాలు..
ఒడిశా, పంజాబ్ బాటలో మరికొన్ని రాష్ట్రాలూ కేంద్రం అధికారిక ప్రకటన కంటే ముందే లాక్ డౌన్ కొనసాగింపు నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దేశంలో మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రం మహారాష్ట్ర ఇవాళో రేపో లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం వెలువరించనుంది. ఇక రెండో మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నివేదించింది. దీనిపై సీఎం పళనిస్వామే ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇటు తెలంగాణలోనూ శనివారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్.. లాక్ డౌన్ కొనసాగించి తీరుతామని స్పష్టం చేసిన దరిమిలా, ఆ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.