కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోంది, మరణాల రేటు తగ్గుతోంది: హర్షవర్ధన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలను వెల్లడించారు.
రికవరీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది..
కరోనా మహమ్మారిపై కొనసాగుతున్న పోరాటంలో త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు హర్షవర్ధన్. గతంలో రికవరీ రేటు 9శాతం అని ఓ మీడియా సమావేశంలో చెప్పడం గుర్తుందన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కోలుకుంటున్నవారి శాతం రోజు రోజుకీ పెరుగుతూనే వస్తోందని ఆయన అన్నారు. అంతేగాక, మరణాల రేటు కూడా రోజు రోజుకూ తగ్గుతోందని తెలిపారు.
మరణాల రేటూ తక్కువగానే..
కాగా, దేశంలో గురువారం ఒక్కరోజే 55,573 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 17,51,555 మంది కరోనా కోరల్లోంచి బయటపడగా.. రికవరీ రేటు 71.17 శాతంగా ఉంది. గురువారం ఒక్కరోజే 1007 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 48,040కు చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.95శాతంగా ఉంది.
Recommended Video
అత్యధిక పరీక్షలు.. పెరుగుతున్న కేసులు..
మరోవైపు దేశంలో కరోనా టెస్టులు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. మొత్తం 1451 ల్యాబోరేటల్లో గురువారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 8,48,728 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా పరీక్షల సంఖ్య 2,76,94,416కు చేరింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు దేశంలో 25,13,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6,66,062 యాక్టివ్ కేసులున్నాయి. 17,97,503 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 49,006 మంది కరోనా బారినపడి మరణించారు. శుక్రవారం ఇప్పటి వరకు 53,447 మంది కరోనా బారిన పడ్డారు. 46,867 మంది కోలుకున్నారు.