కరోనావైరస్ పరీక్షలకు ఫీజు నిర్ణయించిన ప్రభుత్వం: ప్రైవేట్ ల్యాబులకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి మాట్లాడుకుంటున్నా వారి మధ్య టాపిక్ కరోనావైరస్ తప్ప మరొకటి ఉండటం లేదు. ఎక్కడో చైనాలో బయటపడి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న ఈ మహమ్మారి... ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. చైనాలో పుట్టినప్పటికీ అక్కడి కంటే ఇతర దేశాల్లో ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మృతుల సంఖ్యలో ఇటలీ అంతకంతకు పెరిగిపోతోంది. తొలినాళ్లలో మృతుల సంఖ్యలో చైనా అగ్రస్థానంలో నిలవగా ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉన్న ఇటలీ ఇప్పుడు అదే మరణాల సంఖ్యలో డ్రాగన్ కంట్రీని వెనక్కు నెట్టి అగ్రస్థానంకు ఎగబాకింది. ఇక భారత్లో కూడా వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తోంది.
శుక్రవారం రోజునుంచి శనివారం వరకు భారత్లో 60 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం నాటికి ఈ కేసుల సంఖ్య 315కు చేరుకున్నాయి. ఇక కరోనావైరస్ భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి కోసం టెస్ట్ సెంటర్లను కూడా ప్రభుత్వం పెంచుతోంది. ఎప్ఏబీఎల్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ల్యాబులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక్కడ కోవిడ్-19కు సంబంధించిన శాంపిల్స్ను పరీక్షిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం టెస్టింగ్ సెంటర్లకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
ప్రైవేట్ ల్యాబుల్లో కరోనావైరస్ పరీక్షలకు రూ.4500 కంటే ఎక్కువగా వసూలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంకంటే ఎక్కువగా బాధితుల నుంచి వసూలు చేస్తే శిక్ష తప్పదని సూచించింది. ఇక కరోనావైరస్ శాంపిల్స్ను పరీక్షించే ల్యాబ్స్కు కొన్ని సూచనలు చేసింది. అవి ఇలా ఉన్నాయి.
* కోవిడ్-19 శాంపిల్స్కు ప్రైవేట్ ల్యాబులు రూ.4500 కంటే ఎక్కువగా డబ్బులు తీసుకోరాదని నేషనల్ టాస్క్ ఫోర్స్ సూచనలు చేసింది ఇందులో రూ.1500 స్క్రీనింగ్ టెస్టు కోసం మరో రూ.3వేలు నిర్థారణ పరీక్ష కోసం వసూలు చేస్తారు.
* బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బైయో సేఫ్టీ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలి
* ఇళ్లకే వెళ్లి బాధితుల శాంపిల్స్ తీసుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే వైరస్ ఇతరులకు సోకకుండా ఉంటుంది
* రియల్ టైమ్ పీసీఆర్ ఆధారిత కోవిడ్-19 టెస్టులు మాత్రమే చేయాలి. యాంటీ బాడీ/యాంటీజెన్ టెస్టులు చేయడం అక్కర్లేదు
* గుర్తింపు పొందిన ప్రైవేట్ ల్యాబొరేటరీలన్నీ కోవిడ్ -19 పాజిటివ్ శాంపిల్స్ను ఎన్ఐవీ పూణేకు పంపాల్సి ఉంటుంది.తరలింపులో అన్ని జాగ్రత్తలు పాటించాలి
* కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేట్ ల్యాబ్లు వ్యవహరించాల్సి ఉంటుంది. ఎక్కడే కానీ నిబంధనలను ఉల్లంఘించరాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది