వామ్మో.. వైద్య సిబ్బందిని వదలని కరోనా, ముంబైలో ముగ్గురు నర్సులకు పాజిటివ్.. మరో 32 మంది..
కరోనా వైరస్ మహమ్మారి బారిన వైద్యం చేసే సిబ్బంది కూడా పడుతోన్నారు. రోగులకు వైద్యం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ముంబైలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. అందులో ఇద్దరు ఒక రోగికి వైద్యం అందించగా.. మరొకరికి ఎలా సోకిందో అర్థం కావడం లేదు. ఆ నర్స్ వైరస్ సోకిన రోగిన వైద్యం అందించలేదు. అలాగే విదేశాల నుంచి కూడా రాలేదు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ముంబైలో గల వొక్హార్ట్ ఆస్పత్రిలో 70 ఏళ్ల వృద్దుడు ఆంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అతనికి ఒక నర్స్, కంపౌండర్ చికిత్స అందజేశారు. సర్జరీకి ముందు అతనికి ఎలాంటి వైరస్ లేదు. అందుకోసమే సాధారణంగా ట్రీట్మెంట్ చేశారు. కానీ తర్వాత అతనికి కరోనా వైరస్ ఉన్నట్టు బయటపడింది. దీంతో ఇద్దరు సిబ్బందికి వైరస్ సోకింది. ప్రస్తుతం వారిద్దరీ పరిస్థితి బాగుందని డాక్టర్ పరాగ్ రిందానీ పేర్కొన్నారు.
వైరస్ లేదు.. కానీ...
వారిద్దరి పరిస్థితి ఇలా ఉంటే జాస్లోక్ ఆస్పత్రికి చెందిన మరో నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆమె చికిత్స అందిస్తోన్న రోగులకు కరోనా వైరస్ లేకపోవడం విశేషం. ఆమె ఇటీవల విదేశాలకు కూడా వెళ్లలేదు. దీంతో ఆమెకు వైరస్ ఎలా సోకిందో అంతుపట్టడం లేదు.
36 మందికి పరీక్షలు
ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వర్లి కొలివాడలో 8 పాజిటివ్ కేసులను గుర్తించారు. వారు కాంటాక్ట్లో ఉన్న 36 మందికి పరీక్షలు చేశారు. వీరికి పాజిటివ్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా కాంటాక్ట్ లిస్టును నాలుగు విభాగాలుగా గుర్తిస్తారు. ఎపిక్ సెంటర్ క్లస్టర్, హై రిస్క్ కాంటాక్ట్స్, కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్గా విడదీశారు. ముంబైలో వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు 227 ప్లైయింగ్ స్వ్కాడ్లను నియమించినట్టు సీఎం ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు. జిల్లాలతో పోల్చితే.. ముంబైలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవాకశం ఉండటంతో ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.