Coronavirus:భారత్ను భయపెడుతోన్న వైరస్: ఢిల్లీలో ముగ్గురికి: కేరళలో 450 మందికి ఎమర్జెన్సీ టెస్ట్..!
న్యూఢిల్లీ: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్.. భారత్ను భయాందోళనలకు గురి చేస్తోంది. చైనా నుంచి వస్తోన్న ప్రయాణికులు, సందర్శకులను పరీక్షించడానికి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేసినప్పటికీ.. ఆ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. దేశ రాజధానిలో ముగ్గురికి ఈ వైరస్ సోకింది. వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కేరళలో ఏకంగా 450 మందికి అత్యవసరంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు.
రక్త నమూనాలను లాబొరేటరికీ..
ఢిల్లీలో కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నామని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షీ భరద్వాజ్ తెలిపారు. వారి రక్తపు నమూనాలను సేకరించి, లాబొరేటరీకి పంపించామని అన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి చూస్తే.. కరోనా వైరస్ సోకిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా వారిని ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కేరళలో 450 మందికి పరీక్షలు..
కేరళలో ఏకంగా 450 మందికి పరీక్షలను నిర్వహిస్తున్నారు అక్కడి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు. రాజధాని తిరువనంతపురం సహా ఎర్నాకుళం, త్రిశూర్, పత్తినంథిట్ట, మళప్పురం జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఎర్నాకుళంలో ముగ్గురు, తిరువంతపురం, త్రిశూర్లల్లో ఒకరు చొప్పున, పత్తినంథిట్ట, మళప్పురం ఆసుపత్రుల్లో ఇద్దరి రక్త నమూనాల్లో కరోనా వైరస్ జాడ లేదని పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థ నుంచి నివేదికలు వచ్చాయని, దీనితో వారిని డిశ్చార్చి చేసినట్లు చెప్పారు. మిగిలిన వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.
తెలంగాణ పలు రాష్ట్రాల్లో హై అలర్ట్..
తెలంగాణ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ఆరోగ్యపరమైన హైఅలర్ట్ను జారీ చేశారు. మూడు రోజుల్లో చైనా నుంచి భారత్కు చేరిన వేలాది మంది ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ నిర్వహించారు. సోమవారం రాత్రి నాటికి మహారాష్ట్రలో 3756 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేపట్టారు. చైనా నుంచి స్వరాష్ట్రానికి తిరుగుముఖం పట్టిన కొందరు బిహారీ మహిళలను ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్క్రీనింగ్ నిర్వహించారు. బిహార్లోని ఛాప్రా, సరన్ జిల్లాలకు చెందిన వారిని రాజధాని పాట్నాలోని ఆసుపత్రిలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని డాక్టర్లు వెల్లడించారు.
Recommended Video
ఆ నాలుగు రాష్ట్రాలపై నిఘా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత చైనా నుంచి పంజాబ్, గుజరాత్, కర్ణాటక, గోవాలకు ప్రయాణికులు, స్వదేశీయులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచింది. అనారోగ్యానికి గురైనట్లు భావిస్తోన్న వారికి వెంటనే కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.