1000 ఏళ్లలో ఒకసారి జరిగే ఛాన్స్.. కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ కీలక విషయాలు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మూలాలపై నిరంతర అధ్యయనాలు,పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరస్ గబ్బిలాల ద్వారానే మనుషులకు సోకిందా.. లేక వాటిల్లో వృద్ది చెంది మరో జంతువు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందిందా అన్న కోణంలో ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ పరిశోధనలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) స్పందించింది. కరోనా వైరస్ మనుషులకు గబ్బిలాల ద్వారా నేరుగా వ్యాప్తి చెందడం లేదా వాటి నుంచి అలుగు(పాంగోలిన్)లకు వ్యాప్తి చెంది.. అనంతరం మనుషులకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని పేర్కొంది.
1000 ఏళ్లల్లో ఒకసారి...
చైనా పరిశోధనల ప్రకారం కరోనా వైరస్ గబ్బిలాల్లోనే వృద్ది చెందిందని ఐసీఎంఆర్ సైంటిస్ట్ డా.రమన్ ఆర్ గంగాఖేడ్కర్ తెలిపారు. అయితే వైరస్ గబ్బిలాల నుంచి అలుగు జంతువులకు కూడా వ్యాప్తి చెంది ఉండవచ్చునని.. వాటి ద్వారా మనుషులకు సంక్రమించి ఉండవచ్చునని కూడా అన్నారు. అయితే గబ్బిలాల ద్వారా కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందడమనేది 1000 ఏళ్లలో ఒకసారే జరిగే అవకాశం ఉందని.. కొన్ని రకాల వైరస్లు అవి వృద్ది చెందడానికి నిలయమైన జీవజాలాలను కూడా మార్చుకుంటూ ఉంటాయని పేర్కొన్నారు.
భారత గబ్బిలాల్లో వైరస్.. కానీ..
ఇక భారత్లోని రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్ను గుర్తించామని గంగాఖేడ్కర్ తెలిపారు. అయితే ఇది గబ్బిలాల్లోనే వృద్ది చెందిందని తాము భావించట్లేదన్నారు.గబ్బిలాల్లో గుర్తించిన వైరస్ మనుషులకు వ్యాప్తి చెందేంత శక్తివంతంగా లేదన్నారు. వైరస్ మూలాలను కనుగొనేందుకు భారత్లోని అనేక జంతువులపై పరిశోధనలు జరుపుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డారు. అయితే చైనాలోని వుహాన్ నగరంలోని సీ ఫుడ్ మార్కెట్ ద్వారానే వైరస్ మనుషులకు వ్యాప్తి చెంది ఉండవచ్చునన్న థియరీని చాలామంది కొట్టిపారేశారు. ఆ మార్కెట్ నుంచి విక్రయించిన పాంగోలిన్స్ ద్వారానే వైరస్ వ్యాప్తి చెందవచ్చునన్న వాదనతో వారు ఏకీభవించడం లేదు.
ఆ రాష్ట్రాల గబ్బిలాల్లో..
ఇటీవల ఐసీఎంఆర్ నిర్వహించిన పరిశోధనల్లో భారత్లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న గబ్బిలాల గొంతుల్లో నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్లో పరీక్షించారు. ఇందులో రౌసెట్టస్(Rousettus),టెరోపస్(Pteropus) అనే గబ్బిలం జాతుల నమూనాల్లో కరోనా వైరస్ బయటపడింది. కేరళ,హిమాచల్ ప్రదేశ్,పుదుచ్చేరి,తమిళనాడుల నుంచి సేకరించిన గబ్బిలాల శాంపిల్స్ కరోనా పాజిటివ్గా తేలాయి. అదే సమయంలో కర్ణాటక,తెలంగాణ,గుజరాత్,ఒడిశా,పంజాబ్,చంఢీఘడ్ రాష్ట్రాల నుంచి సేకరించిన గబ్బిలాల శాంపిల్స్ నెగటివ్గా తేలాయి. అయితే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు తేలినప్పటికీ.. అది మనుషులకు వ్యాప్తి చెందే స్థాయిలో వృద్ది చెందలేదని కనిపెట్టారు.
పెరుగుతున్న కేసులు..
భారత్లో కరోనా కేసుల సంఖ్య 12వేలు దాటింది. మహారాష్ట్రలో 2916,ఢిల్లీలో 1578,తమిళనాడులో 1242,రాజస్తాన్లో 1076 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం 422 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ను మే 3 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అలాగే హాట్ స్పాట్లు,క్లస్టర్ జోన్స్,కంటైన్మెంట్లను గుర్తించి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.
Recommended Video