Coronavirus:మేకలు, గొర్రెలకు క్వారంటైన్, బెంగళూరు టూ భోపాల్ ల్యాబ్ నివేదిక, ఏం జరిగిందంటే ?
బెంగళూరు/ భోపాల్: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చెయ్యడానికి ఐసోలేషన్ వార్డుల్లో, క్వారంటైన్ లో వైద్యులు 24 గంటలు శక్తివంచన లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన మేకలు, గొర్రెల క్వారంటైన్ స్టోరీ ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ లో ఉన్న గొర్రెలకు కరోనా వైరస్ సోకిందని హడలిపోయిన ప్రజలు అసలు ఏం జరుగుతుందో ? చూడాలి అని టెన్షన్ గా ఎదురు చూశారు. క్వారంటైన్ లో ఉన్న గొర్రెలు, మేకలకు పశువైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి వాటి నమూనాలను బెంగళూరు, భోపాల్ లోని ల్యాబ్ కు పంపించారు. గొర్రెల కాపరికి ఇప్పటికే కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. గొర్రెల కాపరికి కరోనా వచ్చింది, మరి గొర్రెలు, మేకలకు కరోనా వస్తుందా ? వస్తే మా పరిస్థితి ఏమిటి అని స్థానిక ప్రజలు టెన్షన్ పడ్డారు. ఎట్టకేలకు బెంగళూరు, భోపాల్ ల్యాబ్ ల్లో మేకలు, గొర్రెలకు ఏమయ్యింది ? అనే విషయంపై పరీక్షలు నిర్వహించి నివేదిక పంపించారు.
Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్
వందల గొర్రెల యజమాని
కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలుకా గోడేకెరె గొల్లరహట్టిలో ఓ గొర్రెల కాపరి నివాసం ఉంటున్నాడు. ఈ గొర్రెల కాపరికి వందల గొర్రెలు, మేకలు, ఆవులు ఉన్నాయి. గోడేకెరె గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మేకలు, గొర్రెలు ఈయనకే ఉన్నాయి. గొర్రెల కాపరికి జ్వరం, జలుబు, దగ్గు రావడంతో రెండు రోజులు భాదపడ్డాడు. అయితే గొర్రెల కాపరి బాధచూసిన అతని స్నేహితుడు అతన్ని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాడు. గొర్రెల కాపరికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తించారు. గొర్రెల కాపరిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రి క్వారంటైన్ కు తరలించారు.
స్నేహితుడి ఇంట్లో ఏం జరిగిందంటే ?
గొర్రెల కాపరిని ఆసుపత్రికి తీసుకెళ్లిన అతని స్నేహితుడిని తుమకూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని క్వారంటైన్ కు తరలించారు. అయితే గొర్రల కాపరిని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన స్నేహితుడి ఇంటిలో వరుసగా ఐదు మేకలు, మరుసటి రోజు మరో రెండు గొర్రెలు మరణించాయి. గొర్రెల కాపరి స్నేహితుడి ఇంటిలో ఉన్న మేకలు, గొర్రెలు వరుసగా చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు గురైనారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడం వలనే అతని స్నేహితుడి ఇంటిలో కరోనా వైరస్ వ్యాధితోనే మేకలు, గొర్రెలు చనిపోతున్నాయని గ్రామస్తులు హడలిపోయారు.
మంత్రి మాటంటే మాటే !
వెంటనే గొర్రెల కాపరికి చెందిన మేకలు, గొర్రెలు, ఆవులను క్వారంటైన్ కు తరలించి కరోనా వైద్య పరీక్షలు చెయ్యాలని తుమకూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన జేసీ. మధుస్వామి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంత వరకు మేకలు, గొర్రెలు, ఆవులకు కరోనా వైరస్ వచ్చినట్లు ఎక్కడా వెలుగు చూడలేదు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులు మంత్రి మధుస్వామికి చెప్పారు. నేను చెప్పిన మాట వినండి అంటూ మంత్రి మధుస్వామి అధికారులకు ఘాటుగా సమాధానం చెప్పడంతో అధికారులు గొర్రెల కాపరికి చెందిన 43 మేకలు, గొర్రెలను జక్కనహళ్ళి లోని ఓ పెద్ద షెడ్ లోని క్వారంటైన్ కు తరలించి అక్కడ వాటికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
బెంగళూరు టూ భోపాల్
తుమకూరులోని గొల్లరహట్టిలో మేకలు, గొర్రెల రక్త నమూనాలు సేకరించిన వైద్యులు వాటిని బెంగళూరుకు, భోపాల్ లోని ప్రత్యేక ల్యాబ్ కు పంపించారు. గొల్లరహట్టిలోని మేకలు, గొర్రెలు, కోళ్ల, వాటి మాంసం ఎవ్వరూ విక్రయించరాదని అధికారులు స్థానిక గ్రామస్తులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి తుమకూరు జిల్లాలో గొర్రెల వ్యాపారులు, మాంసం ప్రియులు మేకలు, గొర్రెల వైద్య నివేదిక ఎలా వస్తుందో ? అంటూ ఇన్ని రోజులు టెన్షన్ గా ఎదురు చూశారు.
Recommended Video
మేకలు, గొర్రెలకు కరోనా ఉందా ? లేదా
భోపాల్ నుంచి శుక్రవారం బెంగళూరుకు ఓ సమాచారం అందింది. గొల్లరహట్టిలోని మేకలు, గొర్రెల రక్తపరీక్షలు చేశామని, వాటికి కరోనా వైరస్ లక్షణాలు ఏమాత్రం లేవని భోపాల్ లోని ప్రత్యేక ల్యాబ్ నుంచి సమాచారం అందింది. మేకలు, గొర్రెలకు కరోనా వైరస్ లేదని వెలుగు చూడటంతో స్థానిక గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారి తీసిన మేకలు, గొర్రెల క్వారంటైన్ కథ క్లైమాక్స్ చల్లగా సమాప్తం అయ్యింది.