Analysis:దలాల్ స్ట్రీట్కు బ్లాక్డే.. ఈ మూడు అంశాలే మార్కెట్ల పతనాన్ని శాసించాయా..?
గత కొన్ని రోజులుగా మార్కెట్లు పతనమవుతూ వస్తున్నాయి. ఇక సోమవారం రోజున మాత్రం గత 15 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్లు పతనమయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్లు ఆవిరైందంటే మార్కెట్ల పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పడిపోగా... నిఫ్టీ 10500 పాయింట్లకు పడిపోయింది. మొత్తానికి మార్కెట్ల దయనీయ స్థితికి మూడు కారణాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కుప్పకూలిన మార్కెట్లు
సోమవారం రోజున దలాల్ స్ట్రీట్కు బ్లాక్డే అని చెప్పొచ్చు. ఎప్పుడూ లేనంతగా మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం రోజున ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35,634.95 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 10,451.45 పాయింట్ల వద్ద ముగిసింది. ముందటి రోజు ట్రేడింగ్ కంటే సెన్సెక్స్ 5.17శాతం తక్కువగాను, నిఫ్టీ 4.9శాతం తక్కువగాను ముగిశాయి. ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బాగా దెబ్బతిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడిందని చెబుతున్నారు. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా 30శాతం మేరా పతనం కావడంతో తిరోగమన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 1991 తర్వాత ఈ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం.
ఈ మూడు అంశాలే..
ఇప్పటికే కరోనా వైరస్ ఆందోళనతో మార్కెట్లు హీనస్థితిని ఎదుర్కొంటుండగా యెస్ బ్యాంక్ వ్యవహారం పుండు మీద కారం చల్లినట్లుగా తయారైంది. మూలధనం సేకరణలో విఫలమైన యెస్ బ్యాంక్ను ఆర్బీఐ 30 రోజుల పాటు మారిటోరియం కింద ఉంచింది. ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చినప్పటికీ... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మార్కెట్ మూడ్ను మార్చేసింది. అయితే సోమవారం మధ్యాహ్న సమయంలో మార్కెట్లు కాస్త కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ కరోనావైరస్ అంశం దాన్ని చెరిపివేసింది.
సౌదీ అరేబియా తీసుకున్న చర్యలతోనే...
ఇక దలాల్ స్ట్రీట్ పతనం కావడానికి ప్రధాన కారణం ముడిచమురు ధరలు పడిపోవడం. చమురు ధరలు తగ్గించేందుకు సౌదీ అరేబియా తీసుకున్న చర్య ప్రపంచదేశాల ముడిచమురు ధరల పతనంకు కారణమైందని ఇది చారిత్రాత్మక పతనంకు దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యతో ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్లాంటి ఆయిల్ సంస్థపై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలో ప్రధాన ఆయిల్ సంస్థలైన రిలయన్స్ ఓఎన్జీసీలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా ఆయిల్ ధరలు తక్కువగా ఉండటం భారత్కు మంచి పరిణామమే అయినప్పటికీ... ఒక్కసారిగా ముడిచమురు ధరలు పతనం కావడం అభివృద్ధి చెందుతున్న దేశానికి మంచిది కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కరోనావైరస్తో మార్కెట్లు మరింత క్షీణించే అవకాశం
ఇక ఆయిల్ ధరలు హఠాత్తుగా పడిపోవడం దానికి తోడు కరోనావైరస్ ప్రభావం ఉండటం మార్కెట్లకు చీకటిరోజుగా మారింది. అంతేకాదు చైనానే కాకుండా ఇతర దేశాలను కరోనావైరస్ వణికిస్తుండటంతో పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు కరోనావైరస్ ప్రపంచ మార్కెట్లను మరింత పతనస్థాయికి చేరుస్తుందనే వార్తను కూడా నిపుణులు కొట్టిపారేయలేకున్నారు. ఇతర దేశాలకు కూడా కరోనా విస్తరిస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్థికంగా ఏమేరకు నష్టం వాటిల్లిందనేది చెప్పడం చాలా కష్టంగా మారిందని అనలిస్టులు చెబుతున్నారు. టూరిజం,వాణిజ్యం రంగాలు అధికంగా నష్టపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అధికంగా నష్టపోయింది మాత్రం ఆసియా దేశాల మార్కెట్లే అని చెబుతున్నారు.
పుండుమీద కారం చల్లినట్లుగా యెస్బ్యాంక్ వ్యవహారం
కరోనావైరస్, ఆయిల్ ధరలు పడిపోవడం లాంటి అంశాలతో మార్కెట్లు పతనం అవుతుండగా.. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా యెస్బ్యాంక్ ఎపిసోడ్ తయారైంది. ఇది కూడా సోమవారం మార్కెట్లు కుప్పకూలేందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇటు ప్రభుత్వం అటు ఆర్బీఐలు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ముందుకు రాగా అప్పటికే ఇన్వెస్టర్లలో ఒక ఆందోళనకరమైన వాతావరణంలోకి నెట్టివేయబడ్డారని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. ఇక ఆర్బీఐ చేపడుతున్న దిద్దుబాటు చర్యలతో ఆ ప్రభావం బాండ్లు మరియు మ్యూచువల్ ఫండ్ మార్కెట్పై తీవ్రంగా పడే అవకాశం ఉన్నట్లు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు బ్యాంకులో బాండ్ల రూపంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. యెస్ బ్యాంక్ సంక్షోభంతో బ్యాంకింగ్ రంగంలోని స్టాక్స్ కూడా పతనమయ్యాయి.
మొత్తానికి ఈ మూడు కారణాల వల్లే సోమవారం రోజున దలాల్ స్ట్రీట్కు చీకటిరోజుగా మారిందనే అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.