ఆప్తోనే గోవాలో అవినీతి ఆటకట్టు: ఎల్విస్ గోమ్స్
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు తెర దించడంతోపాటు అవినీతిని అంతమొందిస్తామని ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ తెలిపారు.
పనాజీ: ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు తెర దించడంతోపాటు అవినీతిని అంతమొందిస్తామని ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ తెలిపారు. ప్రభుత్వ అస్థిరతకు చరమ గీతం పాడటంతోపాటు మైనింగ్ రంగంలో అవినీతి నిర్మూలన, పర్యాటక రంగంలో సంస్కరణలు తీసుకొస్తామని ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్కు, ఎల్విన్ గోమ్స్ మధ్య చాలా సారూప్యం ఉంది. కేజ్రీవాల్ మాదిరిగానే గోమ్స్ కూడా ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన గోమ్స్.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో అవినీతి, అశ్రిత పక్షపాతం, రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ సర్వీసుల నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. ఆ వెంటనే ఆప్లో చేరిన గోమ్స్ పలు అంశాలపై ప్రభుత్వాన్ని న్యాయస్థానం మెట్లెక్కించారు. కేవలం నెల రోజుల క్రితమే ఆప్ నాయకత్వం గోమ్స్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. శనివారం కొత్త శాసనసభ్యులను ఎన్నుకునేందుకు గోవాలో పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో గోమ్స్ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివి:
ప్రభుత్వాలన్నీ ఒక్కటే
గోవాలో గత పదేళ్లలో 10 ప్రభుత్వాలు పాలన సాగించాయని, 2012లో మాత్రమే ఏక పార్టీ ప్రభుత్వం నడిచిందన్న గోమ్స్.. అన్ని ప్రభుత్వాల తీరు ఒకేలా ఉన్నదని తెలిపారు. 2012 మాత్రమే భిన్నమైనదేనని చెప్పారు. గోవా ప్రజలు ఆయారాం, గయారాం రాజకీయాలు, ఇంతకుముందు ఎన్నడూ లేని అవినీతిని చూశారని చెప్పారు. ప్రస్తుత రక్షణశాఖ మంత్రి 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతిపై విమర్శలు చేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చినా అవినీతిపరులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఉద్యోగ బాధ్యతల్లో పలు ఇబ్బందులను ఎదుర్కొన్నానన్న గోమ్స్.. రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసి ఐపీఎస్ హోదాకు చేరుకున్న తనకు ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో జరగుతున్న విషయాలు ఇబ్బంది కలిగించాయని గోమ్స్ స్పష్టం చేశారు. ఆయా ప్రభుత్వాల తీరుతో తానెప్పుడూ సంతృప్తి చెందలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపి వరకు 1998 - 2016 మధ్యకాలంలో పలు ప్రభుత్వాల్లో పనిచేసినా ఎక్కడా ఎటువంటి మార్పు కాన రాలేదన్నారు. చిన్న రాష్ట్రం కావడమే గోవాలో పలు సమస్యలకు కారణమై ఉండొచ్చన్నారు.
సిఎంలు, మంత్రులు పాలనా వ్యవహారాలలో నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల అధికారులకు అనేక ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. తన విషయంలోనూ అదే జరిగిందని ఆయన అన్నారు. ఏ అధికారి కూడా రాజకీయ నాయకులతో గొడవలు పడరని తెలపారు. తనకు ఇబ్బంది కలిగించిన ప్రస్తుత రక్షణ మంత్రి, నాటి సీఎం మనోహర్ పారికర్ను కోర్టులో సవాల్ చేసి గెలిచానన్నారు.
షా కమిషన్ నివేదిక బుట్టదాఖలు
తనపై అవినీతి నిరోధక విభాగం (ఎసిబి) చేసిన ఆరోపణలు పూర్తిగా అర్థరహితం, కల్పితమని గోమ్స్ చెప్పారు. తనపై అభియోగాలు నమోదుచేసే ముందుకు తమ ముందు హాజరు కావాలని పోలీసులనే న్యాయస్థానం ఆదేశించిందని గోమ్స్ అన్నారు. రాష్ట్రంలో ఆదాయ వనరుల్లో, సహజ వనరుల్లో మైనింగ్ పరిశ్రమ చాలా పెద్దదన్నారు. ప్రజల జీవనానికి, ఆదాయానికి ఇది పెద్ద వనరని తెలిపారు. కుంభకోణాలు, అవినీతిపై షా కమిషన్ ఇచ్చిన నివేదికను పారికర్ పట్టించుకోలేదన్నారు.
ఇక్కడ అక్రమ మైనింగ్ ఎలా జరుగుతుందో, ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుందో కాంగ్రెస్ సీఎం దిగంబర్ కామత్, భూగర్భగనులశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన కుంభకోణంలో భాగస్వాములైన పలువురు రాజకీయ నాయకుల జాబితాను షా కమిషన్ బయట పెట్టినా ప్రభుత్వం ఏ ఒక్కరిపైనా చర్య తీసుకోలేదని చెప్పారు. ఇక రాష్ట్రానికి ఆదాయ వనరుల్లో పర్యాటక రంగం కూడా ప్రధానమైనా గోవాకు వచ్చే పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాల్సి ఉన్నదని గోమ్స్ వివరించారు.
అధికారంలోకి వస్తే మైనింగ్ కుంభకోణంపై తప్పక చర్యలు
తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మైనింగ్ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామని ఎల్విస్ గోమ్స్ తేల్చి చెప్పారు. షా కమిషన్ నివేదికను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే అనుసరించాల్సిన వ్యూహంపై అప్పుడు ఆలోచిస్తామన్నారు. తాము ఏ ఒక్కరికీ ఓట్ల కోసం డబ్బులు ఇవ్వలేదన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు తమను ఆదరించారని, అవినీతిమయ రాజకీయాలను మార్చగల శక్తిగల పార్టీ ఆప్ మాత్రమేనని వివరించారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలే తమ ఓటు బ్యాంకు అని, వారికి పరిస్థితులు వివరించి, వారి ఓట్లు పొందుతామన్నారు. గోవా ప్రజలకు ఆప్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు. కార్యకర్తలపై ఆధారపడి ప్రచారం, ర్యాలీలు నిర్వహించిన నిధులు సమీకరిస్తామని చెప్పారు.