ఆల్టైం రికార్డు: 425 కోట్ల బంగ్లా కోనుగోలు చేసిన బిర్లా
ముంబై: నగరంలోని మలబార్ హిల్పై ఉన్న 'జతియా హౌస్' గత పాత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక ధరకు అమ్ముడై రికార్డు సృష్టించింది. సుమారు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడ్డ ఈ భవనాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా రూ. 425 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.
సోమవారం జరిగిన వేలంపాటలో ఆయన ఈ బిల్డింగ్ ను దక్కించుకున్నాడు. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనా భవంతి కొనుగోలుగా ఈ డీల్ నిలిచింది. గతంలో ఇదే ప్రాంతంలోని మహేశ్వరి హౌస్ 2011లో రూ. 400 కోట్లకు అమ్ముడు కాగా, జతియా హౌస్కు అత్యంత సమీపంలోని హోమీ బాభా హౌస్ గత సంవత్సరంలో రూ. 372 కోట్లకు అమ్ముడైంది.
ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా 10 శాతం మొత్తాన్ని కుమార మంగళం బిర్లా చెల్లించారని, మిగిలిన మొత్తం త్వరలోనే ఇస్తారని వేలం పాట నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసెల్లీ వివరించారు.
జతియా హౌస్ భవంతి పాతదే అయినా, మొత్తం 2,926 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెద్ద పార్కింగ్ ప్రాంతం, నిండైన పచ్చదనంతో నిండివుందని, అందువల్లే దీనికి ఇంత రేటు పలికిందని రియల్ ఎస్టేట్ నిపుణులు వ్యాఖ్యానించారు.
1970ల్లో ఎమ్సీ వకీల్ నుంచి ఈ భవంతిని జతియా కుటుంబం కోనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ భవంతిలో అరుణ్ జతియా, శ్యామ్ జతియా నివసిస్తున్నారు. ఈ కుటుంబం పుదంజీ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ బిజినెస్ను నిర్వహిస్తున్నారు.
ఈ బంగ్లాను కుమార మంగళం బిర్లా కోనుగోలు చేయడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కుమార మంగళం బిర్లా నివసిస్తోన్న ఆల్టామౌంట్ రోడ్లోని బంగ్లా నుంచి ఈ జతియా హౌస్కు రావడానికి కేవలం 10 నిమిషాలు సమయం పడుతుంది.