ఆ దగ్గు మందులో విషం! 9 మంది చిన్నారులు మృతి: 8 రాష్ట్రాల్లో వెనక్కి, కంపెనీ క్లోజ్
న్యూఢిల్లీ: అదొక దగ్గు మందు(కాఫ్ సిరప్). కానీ, ఆ మందు తాగిన తొమ్మిది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్లో జనవరి నెలలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దగ్గు మందు.. కోల్డ్బెస్ట్-పీసీని ఉత్పత్తిదారైన డిజిటల్ విజన్ ఫార్మాసూటికల్స్పై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆ దగ్గు మందులు విషపూరిత పదార్థం..
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డిజిటల్ విజన్ ఫార్మాసూటికల్స్.. కోల్డ్బెస్ట్ పీసీని తమిళనాడుతోపాటు దేశంలోని 9 రాష్ట్రాల నుంచి వెనక్కి తీసుకుంది. ఈ మందులో ప్రాణాంతకమైన రసాయనాలున్న కారణంగానే 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం. డైథీలిన్ గ్లైకోల్ అనే విషపూరిత, కలుషిత పదార్థాలు ఉన్న కారణంగానే ఈ మందు తాగిన 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ది డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్-జమ్మూకాశ్మీర్.. సురీందర్ మోహన్ వెల్లడించారు. ఈ మేరకు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు.
8 రాష్ట్రాల నుంచి మందులు వెనక్కి..
జమ్మూకాశ్మీర్ తోపాటు ఎనిమిది రాష్ట్రాలకు ఇప్పటికే ఈ మందులు సరఫరా కావడంతో వాటిని సదరు కంపెనీ వెనక్కి తీసుకునేందుకు నోటీసులు అధికారులు నోటీసులు పంపారు. కంపెనీ నెలకొల్పబడిన హిమాచల్ప్రదేశ్ తోపాటు జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. కలుషితమైన ఈ సిరప్ పంపిణీని నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఈ సిరప్ను వాడకూడదని ఇప్పటికే ఆరోగ్యశాఖ సంబంధించిన అధికారులందరికీ సమాచారం ఇచ్చామని తిరుచ్చి అధికారులు తెలిపారు.
కోల్డ్ బెస్ట్ పీసీ ఉత్పత్తుల నిలిపివేత..
కాగా, ఆ సిరప్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఫార్మాసూటికల్ కంపెనీ అధికారులు వెల్లడించారు. సిరప్ పంపిణీని కూడా నిలిపివేశామని, డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా సమాచారం అందించామని తెలిపారు. జమ్మూకాశ్మీర్లోని ఉధమ్పూర్ జిల్లాలో ఈ సిరప్ తాగిన 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. విచారణ చేపట్టిన ఆరోగ్య శాఖ అధికారులు.. కోల్డ్బెస్ట్ పీసీ కాఫ్ సిరప్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని గుర్తించారు. డైథీలిన్ గ్లైకోల్ అనే విషపూరిత పదార్థం ఈ సిరప్లో ఉందని పరీక్షల్లో తేలింది.
Recommended Video
ఆ ఫార్మా కంపెనీ క్లోజ్..
ఈ నేపథ్యంలో డిజిటల్ విజన్కు ఉన్న ఈ మందుల తయారీ అనుమతిని రద్దు చేసింది ప్రభుత్వం. అంతేగాక, 5వేలకు పైగా సిరప్ యూనిట్లను వెనక్కి రప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిరప్ ఉత్పత్తును ఈ కంపెనీలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిజిటల్ విజన్స్కు ఇలాంటి మందులు తయారు చేయడం, అధికారుల నుంచి మందలింపులను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. ఈ కంపెనీ తయారు చేసిన సబ్పర్ డ్రగ్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం కావడం గమనార్హం. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల్లో 2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన పరీక్షల్లో విఫలమైంది.