రూ. 33 వేల కోట్ల నకిలీ స్టాంప్ కాగితాల కేసు: కరీంలాలా తెల్గీ పరిస్థితి విషమం, 43 ఏళ్ల జైలు శిక్ష !
దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన రూ. 33 వేల కోట్ల నకిలీ స్టాంపు కాగితాల కేసుల ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీంలాలా తెల్గీ (66) ఆరోగ్య పరస్థితి విషమంగా ఉంది. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలోని ప్రత్
బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన రూ. 33 వేల కోట్ల నకిలీ స్టాంపు కాగితాల కేసుల ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీంలాలా తెల్గీ (66) ఆరోగ్య పరస్థితి విషమంగా ఉంది. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో కరీంలాలా తెల్గీ చికిత్స పొందుతున్నాడు.
అబ్దుల్ కరీంలాలా తెల్గీకి గత 20 ఏళ్ల నుంచి మధుమేహం, రక్తపోటు వ్యాదులు ఉన్నాయి. 2001లో కరీంలాలా తెల్గీకి హెచ్ ఐవీ సోకిందని అప్పట్లో వైద్యులు ధ్రవీకరించారు. కరీలంలాలా తెల్గీ రూ. 33 వేల కోట్ల విలువైన నకిలీ స్టాంపు కాగితాలు ముద్రించి దేశ వ్యాప్తంగా విక్రయించాడని కేసులు నమోదు అయ్యాయి.
కరీంలాలా తెల్గీ నేరం చేశాడని రుజువు కావడంతో అన్ని కేసులకు సంబంధించి 43 ఏళ్ల జైలు శిక్ష పడింది. కరీంలాలా తెల్గీ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కరీంలాలా తెల్గీ అనారోగ్యానికి గురి కావడంతో జైల్లోని ఆసుపత్రిలో చికిత్స చేశారు.
మెరుగైన చికిత్స కోసం అతన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కరీంలాలా తెల్గీ బెంగళూరు కేంద్రంగా తొమ్మిది రాష్ట్రాల్లో 72 కేంద్రాలుగా 350 మంది ఉద్యోగులను నియమించుకుని నకిలి స్టాంపు కాగితాలు విక్రయించాడు. 2001లో కరీంలాలా తెల్గీ కర్ణాటక పోలీసులకు చిక్కిపోయాడు.
ముంబై, కర్ణాటక పోలీసులకు భారీ మొత్తంలో ( రూ. కోట్లలో) లంచం ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు గతంలో నకిలీ స్టాంపు కాగితాల కేసుల విచారణ ఎదుర్కొన్నారు. 2006 జనవరి 17వ తేదీన బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కరీంలాలా తెల్గీ, అతని అనుచరులకు జైలు శిక్ష విధించింది.