మోడీపై కాంగ్రెస్ ఫైర్: వలసకూలీల సమస్యను ప్రస్తావించకపోవడం దారుణం: సుర్జేవాలా...
ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. లాక్ డౌన్ వల్ల వలసకూలీలు ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. వారిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటారా అని.. కుటుంబసభ్యులు ఎదురుచూశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. కానీ వారి ఆశలపై మోడీ నీళ్లు చల్లారని.. ప్రస్తావనే లేకుండా స్పీచ్ ముగించారని ఆయన మండిపడ్డారు.
లేని ప్రస్తావన...
పని లేకపోవడంతో సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్న వలసకూలీల భద్రత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వారు క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత పాలకులదేనని స్పష్టంచేశారు. కానీ వలసకూలీల సమస్య లెవనేత్తకపోవడం దారుణమని సుర్జేవాలా అభిప్రాయపడ్డారు. మీడియా ముందుకు ప్రధాని మోడీ అని పతాక శీర్షికలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ కొన్నివర్గాల పేర్లను మోడీ ప్రస్తావించకపోవడం దారుణమని సుర్జేవాలా మండిపడ్డారు.
నిరాశ..
వివిధ అంశాలపై మాట్లాడిన మోడీ.. వలసకూలీల వెతలు కనిపించలేదా అని సుర్జేవాలా ప్రశ్నించారు. కానీ ప్రెస్ మీట్ తర్వాత ఆ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. సున్నితమైన అంశాన్ని ప్రస్తావించకుండా.. ఒక వర్గ ప్రజల మనోభావాలను మోడీ కించపరిచారని ఆరోపించారు. ఈ మేరకు వరస ట్వీట్లలో సుర్జేవాలా మండిపడ్డారు.
20 లక్షల కోట్ల ప్యాకేజీ...
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం అని పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేస్తారని తెలిపారు. స్వయం సమృద్ది, ఆర్థిక నిర్మాణం కోసమే ప్యాకేజీ ప్రకటిస్తున్నామని.. తెలిపారు. సూక్ష్మ, మధ్యతరగతి వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీకి బలం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. కానీ వలసకూలీల గురించి ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.