దేశాన్ని విభజించే శక్తులను ఉక్కు పాదంతో అణచాలి..! పిలపునిచ్చిన భారతీయుడు..!!
సైదాపేట/హైదరాబాద్ : తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి దేశభక్తిని చాటుకున్నారు. తూత్తుకుడి అంటేనే ఓడరేవు గుర్తుకు రావాల్సింది పోయి, తుపాకీ కాల్పులు గుర్తుకు వస్తున్నాయని ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. దేశాన్ని విభజించే శక్తులు రాష్ట్రంలోకి చొరబడ్డాయని, వాటిని తొలగించాలని పేర్కొన్నారు.
తూత్తుకుడి లోక్సభ ఎంఎన్ఎం అభ్యర్థి పొన్కుమార్, విళాత్తికులం అసెంబ్లీ అభ్యర్థి నటరాజన్లకు మద్దతుగా ఆయన తూత్తుకుడిలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడారు. స్టెరిలైట్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది ఒక పార్టీ అని, విస్తరణకు అవకాశం కల్పించింది మరో పార్టీ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను సాగనంపాలని తెలిపారు. స్టెరిలైట్ పరిశ్రమ వద్దని తాను చెప్పటం లేదని తెలిపారు. దాని కాలుష్యంతో ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూడాలన్నారు.
తమిళులకు వినయం, పరాక్రమం రెండూ ఉంటాయని వ్యాఖ్యానించారు. అందులో వినయాన్ని ఉపయోగించుకుని తమిళులను బానిసలుగా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్టెరిలైట్ ఆందోళనలో కాల్చింది తమిళుడే, కాల్చమని చెప్పిందీ తమిళుడేనని గుర్తుచేశారు. తాను 20 ఏళ్లకు ముందు రాజకీయాలలోకి వచ్చుంటే ఈ అన్యాయం జరిగేది కాదని తెలిపారు.
తమిళనాడు చరిత్రను తిరగరాసే రోజు దగ్గర్లో ఉందని పేర్కొన్నారు. తాను పోటీ చేయకపోవటం గురించి కొంత మంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎంఎన్ఎం తరఫున పోటీ చేసే అభ్యర్థులంతా తన ప్రతిరూపాలని వ్యాఖ్యానించారు. వారిని ఎన్నికలలో గెలిపించి వారు చేసే పనుల ద్వారా ప్రజలు తనను చూడొచ్చని పేర్కొన్నారు