ఈ దేశానికి మైనారిటీల కంటే ఎలుకలతోనే అధిక ప్రమాదం: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి మైనారిటీల నుంచి కంటే ఎలుకల నుంచే అధిక ప్రమాదం పొంచివుందని అన్నారు. కొన్ని వర్గాలు, కొంతమంది వల్ల దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందని అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ చేసిన వ్యాఖ్యాలపై ఒవైసీ మండి పడ్డారు. జార్ఖండ్ లో కొత్తగా నిర్మించిన కోనార్ రిజర్వాయర్ కాల్వ గట్టు తెగడానికి ఎలుకలే ప్రధాన కారణమనే విషయాన్ని అప్పుడే విస్మరించారా? అంటూ ఎదురుదాడికి దిగారు. మైనారిటీల కంటే ఎలుకల వల్లే ఈ ప్రమాదం ఉందని, ఈ విషయం కోనార్ రిజర్వాయర్ రుజువు చేసిందని ఒవైసీ చెప్పారు.
ఇస్రో టార్గెట్..మంగళ్ యాన్-2: అయిదేళ్ల మామ్ ప్రస్థానం..అంచనాలకు మించి!
నవంబర్, డిసెంబర్ లల్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. అసదుద్దీన్ ఒవైసీ రెండు రోజుల పాటు జార్ఖండ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభ, ర్యాలీలో పాల్గొన్నారు. జార్ఖండ్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. కోనార్ రిజర్వాయర్ కాల్వను ప్రారంభించిన 12 గంటల వ్యవధిలోనే అది ధ్వంసమైందని, దీనికి ప్రధాన కారణం ఎలుకలేనంటూ ఇంజినీర్లు సైతం ధృవీకరించారని ఒవైసీ పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక అభ్యర్థులను నిలబెడతామని అన్నారు.
భారత గడ్డ మీదే జన్మించిన జార్ఖండ్ ముస్లింలను బీజేపీ నేతలు బంగ్లాదేశీయులు అనే పేరు పెట్టారని విమర్శించారు. స్థానిక ముస్లింలకు బంగ్లాదేశీయులని ఎద్దేవా చేస్తోన్న బీజేపీ నాయకులు.. అదే బంగ్లాదేశ్ కు విద్యుత్ ను అమ్ముకుని తమ ఖజానా నింపుకొంటున్నారని చురకలు అంటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని ఒవైసీ జోస్యం చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట.. భావసారూప్యం గల పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇస్తామని అన్నారు. చాలా విషయాల్లో మైనారిటీలకు అండగా నిలిచిన ప్రముఖ గిరిజన నేత జైపాల్ సింగ్ ముండాకు అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.