మోడీని గెలిపించారు.. మద్దతిద్దాం, నా ఫ్యామిలీ మినీ ఇండియా: షారుక్ ఖాన్
ముంబై: నరేంద్ర మోడీని ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆయనకు మనం కచ్చితంగా అండగా ఉండాలని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అన్నాడు. గత ఏడాది అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్ ఆయన చిత్రం పైన కూడా పడింది.
తాజాగా, ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశం మోడీని ప్రధానిగా ఎన్నుకుందని, ఆయనను మనమంతా సపోర్ట్ చేయాలన్నాడు.
'నేను ఓ మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మనం ఓ నాయకుడిని దేశం కోసం ఎన్నుకున్నాం. ప్రధానిగా మోడీని ప్రజలు గెలిపించారు. కాబట్టి మనమంతా కచ్చితంగా ఆయనకు అండగా ఉండాలి. మన దేశంలోని మెజార్టీ ప్రజలు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. మన దేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలంటే మనం ఎన్నుకున్న నాయకుడికి మన అండ ఉండాలి' అని షారుక్ ఓ టీవీ షోలోని ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో చెప్పాడు.
రాజకీయ నేతలు ఏదైనా మాట్లాడగలరని (అసహనం పైన), కానీ మేం రాజకీయ నాయకులం కాదని, మేం మనోరంజకులమని (ఎంటర్టైనర్స్) చెప్పాడు. తాను యువతకు సందేశం ఇస్తున్నానని, ప్రాంతీయవాదం, మతవాదం, కులవాదం, రంగు లేదా జాతి... తదితరాల విషయంలో అసహనం వద్దని సూచించారు.
తన తండ్రి స్వతంత్ర సమరయోధుడు అని, అలాంటప్పుడు ఈ దేశం పైన తనకు మరో ఆలోచన ఎలా ఉంటుందని చెప్పారు. తన కుటుంబం ఓ మినీ ఇండియా అని చెప్పారు. నా భార్య హిందువు అని, తాను ముస్లీంను అని, తన ముగ్గురు పిల్లలు మూడు మతాలను అనుసరిస్తారని చెప్పారు.