మరింత పేదగా మారిన త్రిపుర సిఎం: ఆయన ఆస్తులు తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని ముఖ్యమంత్రుల్లోకి అతి పేద త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. అతని చేతులో ఉన్న నగదు కేవలం రూ. 1520. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ సోమవారనాడు తన వ్యక్తిగత ఆర్థిక వివరాలను వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో ధన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో ఆ వివరాలు వెల్లడించారు. తాజా అఫిడవిట్ ప్రకారం ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ జనవరి 20వ తేదీ నాటికి రూ.2410.16 మాత్రమే. 2013 ఎన్నికల సమయంలో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ రూ.9,720.38.
ఐదు విడతలు ఆయన త్రిపర ముఖ్యమంత్రిగా పనిచేశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసింది ఆయనే. 1998 నుంచి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆరోసారి ముఖ్యమంత్రి కావడానికి సమాయత్తమవుతన్నారు.
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా అయిన మాణిక్ సర్కార్ తన వేతనం రూ.26,315 పార్టీ నిధుల కింద జమ చేస్తూ వస్తున్నారు. తన జీవనానికి పార్టీ ఆయనకు నెలకు 9,700 రూపాయలు ఇస్తుంది.
అగర్తాలాలో తన తోబట్టువులతో కలిసి సంయుక్తంగా 0.0118 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు మాణిక్ సర్కార్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అది తనకు వారసత్వంగా వచ్చినట్లు తెలిపారు.
ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు మొబైల్ ఫోన్ లేదు. ఆయనపై బిజెపి సోషల్ మీడియాలో సమరం సాగిస్తోంది. అయినప్పటికీ ఆయనకు సోషల్ మీడియాను ఆయన పట్టించుకోవడం లేదు. ఈమెయిల్ ఖాతా కూడా లేదు.
ఆయన భార్య పాంచాలి భట్టాచార్జీ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి. ఆమె చేతిలో రూ. 20,140 నగదు ఉంది. ఆమె బ్యాంక్ ఖాతాల్లో రూ.12,15,714 నగదు ఉంది.
అగర్తాలాలోని అధికారిక ముఖ్యమంత్రి క్వార్టర్లో ప్రభుత్వం కల్పించిన ప్రభుత్వ వసతిలో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అగర్తాలలో అతి సాధారణ వ్యక్తుల మాదిరిగా మాణిక్ సర్కార్ భార్య రిక్షాలో ప్రయాణం చేస్తూ కనిపిస్తుంటారు.