దంపతుల మాస్టర్ ప్లాన్: బ్యాంకులో నకిలి బంగారు తాకట్టు, రూ. 4.5 కోట్లకు కుచ్చుటోపి !
బ్యాంకులో నకిలి బంగారు నగలు తాకట్టు పెట్టిన దంపతులు రూ. 4.50 కోట్లు రుణం తీసుకున్నారు, చివరికి అరెస్టు దంపతులకు బంగారు నగల షాప్ ఉంది, అయితే ఇలా బుక్కయ్యారు.
బెంగళూరు: బ్యాంకులో నకిలి బంగారం తాకట్టుపెట్టి రూ. 4.50 కోట్లు రుణం తీసుకుని బ్యాంకు అధికారులకు కుచ్చుటోపి పెట్టిన దంపతులను మంగళూరులోని బందరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరులోని బోండల్ ప్రాంతంలోని మేరీహిల్ లో నివాసం ఉంటున్న విద్యానంద రావ్, లలితా దంపతులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
మంగళూరులో విద్యానంద రావ్ బంగారు నగలు తయారు చేస్తూ ఓ జ్యువెలరీషాప్ నిర్వహిస్తున్నాడు. విద్యానంద రావ్, లలితా దంపతులు మిలగ్రీస్ సర్కిల్ లోని కేథలిక్ సిరియన్ బ్యాంకులో ఖతాదారులు. విద్యానంద రావ్, లలితా దంపతులు గత కొంత కాలం నుంచి బ్యాంకులో బంగారం తాకట్టు పెడుతున్నారు.
బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టిన విద్యానంద రావ్, లలితా దంపతులు ఇప్పటి వరకు రూ. 4.50 కోట్లు రుణం తీసుకున్నారు. పదేపదే బంగారు నగలు తాకట్టు పెట్టడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. దంపతులు తాకట్టు పెట్టిన బంగారు నగలు ల్యాబ్ కు పంపించి పరిక్షీంచారు.
కంచుతో తయారు చేసిన నగలకు బంగారు పూత పూసి నకిలి బంగారు నగలు తయారు చేసి తాకట్టు పెట్టారని వెలుగు చూసింది. బ్యాంకు అధికారులు ఫిర్యాదు చెయ్యడంతో బుధవారం బందరు పోలీసులు విద్యానంద రావ్, లలితా దంపతులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.