బెంగళూరులో గ్యాస్ గీజర్ లో విషవాయువు: బాత్ రూంలో సాఫ్ట్ వేర్ దంపతులు!
బెంగళూరు: బెంగళూరు నగరంలో గ్యాస్ గీజర్ నుంచి విషవాయువు లీక్ కావడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో సహ ఆయన భార్య మరణించారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర్ లో నివాసం ఉంటున్న మహేష్ (30), ఆయన భార్య షీలా (30) మరణించారని పోలీసులు అన్నారు.
బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన కంపెనీలో మహేష్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. మహేష్, షీలా దంపతులకు జాహ్నావి (6), సాక్షి (4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం జాహ్నావి, సాక్షి స్కూల్ కు వెళ్లారు.
ఇంటిలో మహేష్, షీలా దంపతులు ఉన్నారు. సాయంత్రం జాహ్నావి, సాక్షి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మహేష్, షీలా దంపతులు ఎంతసేపటికీ ఇంటి తలుపులు తియ్యకపోవడంతో వారి పిల్లలు ఇద్దరూ పక్కింటికి వెళ్లారు.
రాత్రి ఎంత సేపు అయినా మహేష్, షీలా దంపతులు ఇంటి నుంచి బయటకురాకపోవడంతో పక్కింటివారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా మహేష్, షీలా దంపతులు బాత్ రూంలో శవమై కనిపించారు.
మహేష్, షీలా దంపతుల శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని పోలీసులు అంటున్నారు. మహేష్ ఇంటిలోని ల్యాప్ టాప్ లో కొన్ని గంటల ముందు సినిమా చూశారని పోలీసులు గుర్తించారు. బాత్ రూంలో గ్యాస్ గీజర్ ఆన్ లో ఉందని పోలీసులు అన్నారు.
బాత్ రూంలో ఎలాంటి కిటికీ లేదని, గ్యాస్ గీజర్ నుంచి విషవాయువు లీక్ అయ్యి మహేష్, ఆయన భార్య షీలా మరణించి ఉంటారని పోలీసులు అంటున్నారు. మహేష్, షీలా దంపతుల శరీరం మీద ఎలాంటి గాయాలు లేకపోవడం, వారి ఇంటి నుంచి ఎలాంటి కేకలురాకపోవడంతో అవి హత్యలు కాదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేష్, షీలా దంపతులు మృతదేహాలను పోస్టుమార్టుంకు తరలించి విచారణ చేస్తున్నామని రాజరాజేశ్వరీ నగర్ పోలీసులు తెలిపారు.