పోలీసు కస్టడీలో ప్రేమికుల ఆత్మహత్య
రాంచీ: పోలీసుల అదుపులో ఉన్న ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జార్ఖండ్ లో కలకలం రేపింది. ఇద్దరూ వేరు వేరు మతాలకు చెందిన వారు కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు కస్టడీలో ఉన్న ముస్లీం యువకుడు, హిందూ బాలిక సెల్ లోనే మరణించారు.
ఈ జంట ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పైకి పోలీసు అధికారులు అంటున్నారు. గొడ్డా జిల్లాకు చెందిన మహమ్మద్ గఫర్, అదే ప్రాంతానికి చెందిన హిందూ బాలిక (15) ప్రేమించుకున్నారు. 40 రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి మతాంతర వివాహం చేసుకున్నారు.
తము కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహమ్మద్ గఫర్ కు అంతకు ముందే వేరే యువతితో వివాహం అయ్యిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలించారు.
సోమవారం ఇద్దరిని పట్టుకున్నారు. రాంచీ నగరంలోని అర్గోరా పోలీస్ స్టేషన్లో ఇద్దరిని పెట్టి విచారణ చేస్తున్నారు. అయితే మంగళవారం ఇద్దరూ శవమై కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.
విషపూరిత ఆహారం సేవించడం వలనే ఇద్దరూ మరణించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, కేసు దర్యాప్తులో ఉందని రాంచీ ఏఎస్పీ కులదీప్ ద్వివేది తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్షం చేసినందుకు మహిళా ఏఎస్ఐతో పాటు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆత్మహత్య చేసుకున్న జంటల సొంత ప్రాంతంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.