కూతురుతోపాటు దంపతుల హత్య: కొడుకు పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన టుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తులతో అతి కిరాతంగా పొడిచి చంపేశారు. దుండగుల దాడిలో గాయపడిన బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో అతని తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరి హత్య స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్కు చెందిన కాంట్రాక్టర్ మిథిలేశ్ ఆయన భార్య సియా, కూతురు, కుమారుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్లోని కిషన్గఢ్ ప్రాంతంలో నివాసముంటున్నారు.
బుధవారం ఉదయం కొందరు దుండగులు వారింట్లోకి ప్రవేశించి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. మిథిలేశ్తోపాటు అతని భార్య, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. హత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేశారు. ఇంట్లోని లాకర్ నుంచి ఎలాంటి వస్తువులు పోలేదని, దుండగులు వంటగదిలో ఉన్న కత్తితో దాడి చేసి వారిని చంపేశారని డిప్యూటీ కమిషనర్ మేరీ జైకర్ తెలిపారు. 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.
దుండగులు చోరీ ప్రయత్నంలో భాగంగా హత్యలకు పాల్పడ్డారా? లేక వ్యాపార తగాదాలా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆరునెలల క్రితం కొందరు డబ్బు కోసం మిథిలేష్ కొడుకును కిడ్నాప్ చేశారని సియా సోదరుడు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న మిథిలేశ్ కుమారుడు ఇచ్చే సమాచారం కీలకం కానుందని పోలీసులు తెలిపారు. అతడ్ని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.