Lockdown lovers,భలే చాన్స్, ఎస్కేప్, పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్,పోలీసులకు చిర్రెత్తి,కేసు పెట్టి
తిరువనంతపురం: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తల్లడిల్లిపోతున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కేరళ ప్రజలు పదేపదే రోడ్ల మీదకు రావడంతో విసిగిపోయిన పోలీసులు డ్రోన్ల సహాయంతో ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే కేరళ పోలీసులకు మరో తలనొప్పి రావడంతో చిర్రెత్తిపోయారు. లాక్ డౌన్ సమయంలో చిక్కింది చాన్స్ అంటూ లవర్స్ లేచిపోయారు. అమ్మాయి తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు ఎంతో కష్టపడి ప్రేమికులను పట్టుకున్నారు. న్యాయస్థానం ప్రేమికుల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు ఇక చేసేది లేక ఇదే సమయంలో మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టారని ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఎక్కడో మండిపోవడంతో ప్రేమికుల మీద మరో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!
కేరళ పోలీసులకు లాక్ డౌన్ ఇబ్బందులు
కేరళలో లాక్ డౌన్ నియమాలు విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను కంట్రోల్ చెయ్యడానికి స్థానిక పోలీసులు నానాతిప్పలు పడుతున్నారు. ప్రజలకు చెప్పిచెప్పి విసిగిపోయిన కేరళ పోలీసులు చివరికి డ్రోన్లను రంగంలోకి దింపారు. కేరళ పోలీసులు డ్రోన్లకు స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి ప్రజలను భయపెట్టి వారిని ఇండ్లలో నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు.
ప్రేమికులది పాత సినిమా కథ
కేరళలోని కోజికోడ్ లో 21 ఏళ్ల అమ్మాయి, 23 ఏళ్ల అబ్బాయి ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న యువతీ యువకుడు వారి ప్రేమ విషయం వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే అబ్బాయి, అమ్మాయి కులం వేరు కావడంతో వారి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎలాగైనా లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు నిర్ణయించుకున్నారు.
లవర్స్ కు లాక్ డౌన్ భలేమంచి చాన్స్
కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కేరళలో లాక్ డౌన్ సందర్బంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా ప్రేమికులు కొన్ని రోజుల నుంచి కలుసుకోలేకపోయారు. ఎలాగైనా లాక్ డౌన్ సమయంలోనే లేచిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమికులు ఇటీవల వారి ఇండ్ల నుంచి పారిపోయారు.
కేసు పెట్టడంతో పోలీసులకు తలనొప్పి
ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగిరాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నానా తిప్పలుపడి చివరికి అమ్మాయిని, అబ్బాయిని పట్టుకున్నారు. తాము ఇష్టపడి పారిపోయామని, తాము పెళ్లి చేసుకుంటామని పోలీసులకు చెప్పారు. అయితే అప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు మాత్రం ఇద్దరిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ప్రేమికుల పెళ్లికి కోర్టు ఓకే
తన ఇష్టప్రకారం ఇంటి నుంచి పారిపోయానని, తనను ఎవ్వరూ బలవంతం చేసి బయటకు పిలుచుకుపోలేదని అమ్మాయి న్యాయమూర్తి ముందు చెప్పింది. తాము ఇద్దరు మేజర్లు అయ్యామని, మా పెళ్లికి అనుమతి ఇవ్వాలని ప్రేమికులు న్యాయమూర్తికి మనవి చేశారు. ఇద్దరు మేజర్లు కావడంతో వారి పెళ్లికి న్యాయస్థానం ఓకే చెప్పింది.
పోలీసులకు మండిపోయి కేసు పెట్టి !
ప్రేమికులు పారిపోయి మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టారని పోలీసులకు చిర్రెత్తింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలను కంట్రోల్ చెయ్యలేక నానా తిప్పలు పడుతున్న మాకు వీరు లేచిపోయి మరో తలనొప్పి తెచ్చారని పోలీసులు ప్రేమికుల మీద మండిపడ్డారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద సంచరించారని ఆరోపిస్తూ ప్రేమికుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.