భర్తపై తొలిసారి పోటీ చేస్తున్న భార్య, కారణం వెరీ ఇంట్రెస్టింగ్: కలిసే నామినేషన్ వేశారు
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగుతున్నారు. దానికి వారు చెప్పిన కారణం ఆశ్చర్యంగా ఉంటుంది. బికనీర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వరూప్ చంద్ గెహ్లాట్ (54) పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన భార్య మంజు లతా గెహ్లాట్ కూడా బరిలో నిలిచారు.
వీరిద్దరు కలిసి వచ్చి వేర్వేరుగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. తాము ఎప్పుడూ ప్రతిక్షణం కలిసి ఉండాలని ఒకే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశామని చెప్పారు.
తమకు 35 ఏళ్ల క్రితం పెళ్లయిందని, తామిద్దరం చాలా ఆనందంగా ఉన్నామని వారు చెబుతున్నారు. ముగ్గురు కూతుళ్లు ఉంటే వారికి పెళ్లిళ్లు చేశామని చెప్పారు. తాను 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రతిసారి తాను ప్రచారానికి వెళ్లినప్పుడు తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటోందని, అందుకే ఈసారి ఇద్దరం నామినేషన్ వేయాలని నిర్ణయించామని భర్త స్వరూప్ చంద్ చెప్పారు. ఇలా చేస్తే ఇద్దరం కలిసి ప్రచారానికి వెళ్లవచ్చునని చెప్పారు.
మేమిద్దరం ఒకరికి మరొకరం అండగా ఉంటామని, తన భర్త గెలిస్తే తాను మద్దతిస్తానని, నేను గెలిస్తే తన భర్త అండగా ఉంటాడని ఆమె చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా గెలుస్తారన్నారు. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు పోటీ చేస్తూనే, కలిసి ఉండేందుకేనని చెప్పడం గమనార్హం.