బెంగాల్లో దారుణం.. వెలుగులోకి వచ్చిన రెండు జంట హత్యలు.. చంపి శవాలను సూట్కేసులో కుక్కి..
కోల్కతా : బెంగాల్లో దారుణ ఉదంతాలు వెలుగుచూశాయి. రెండు జంట హత్యలు కలకలం రేపాయి. సౌత్ పరిగణ జిల్లాలోని ఓ ఇంట్లో దంపతులను హత్య చేసిన దుండగులు వారిని సూట్కేసుల్లో కుక్కి పెట్టారు. కోల్కతాలో మరో వృద్ధ జంటను దారుణంగా చంపేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య చేసి సూట్కేస్లో కుక్కి
సౌత్ పరిగణ జిల్లాలోని నరేంద్రపూర్ ప్రాంతంలో ప్రదీప్ బిశ్వాస్, ఆయన భార్య అల్పనతో కలిసి ఉంటున్నారు. జులై 28 నుంచి వారు ఫోన్ ఎత్తకపోవడంతో ప్రదీప్ అన్న జాయ్ ఏం జరిగిందో తెలుసుకునేందుకు వారి ఇంటికి వచ్చాడు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటం, ఎంత సేపు కాలింగ్ బెల్ నొక్కినా ఎవరూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లాడు. డోర్ తెరుచుకోగానే ఒక్కసారిగా దుర్వాసన వచ్చింది. బాత్రూంలో ఆయనకు రెండు సూట్ కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. వాటిల్లో ప్రదీప్, అల్పన మృతదేహాలు కనిపించాయి. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించారు.
కేర్ టేకర్లుగా పనిచేస్తున్న దంపతులు
హత్యకు గురైన ప్రదీప్ బిశ్వాస్, ఆయన భార్య అల్పనలు 70ఏళ్ల దీపాంకర్ డే అనే వ్యక్తి ఇంటికి కేర్ టేకర్లుగా ఉన్నారు. కొన్ని రోజులుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన ప్రదీప్ అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో మంగళవారం ఇంటికి చేరుకున్న ఆయనకు తమ్ముడు, అతని భార్య విగత జీవులుగా కనిపించారు. జాయ్ ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వృద్ధ జంట దారుణ హత్య
ఇదిలా ఉంటే కోల్కతాలోని నేతాజీ నగర్లో ఓ వృద్ధ జంట దారుణ హత్యకు గురైంది. 75ఏళ్ల దిలీప్ ముఖర్జీ ఆయన భార్య సప్న వారి ఇంట్లోనే హత్యకు గురయ్యారు. చోరీకి వచ్చిన దుండగులు వారిని చంపేసినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. సప్న మృతదేహం మెట్ల వద్ద, దిలీప్ మంచంపై విగతజీవిగా కనిపించారు. దిలీప్ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన దుండగులు, సప్నను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో దాదాపు రూ. 70 వేలు కనిపించడంలేదని కుటుంబసభ్యులు చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనానికి వచ్చిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంట్లో కొన్ని మార్పులు చేర్చులు చేశారు. ఆ సమయంలో పని చేసేందుకు వచ్చిన కూలీల్లో ఒకరు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.