వివాహేతర సంబంధం: మూత్రం తాగించి, చెప్పులదండతో ఊరేగించారు
భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో ఓ ప్రేమజంటను గ్రామస్థులు చిత్రహింసలు పెట్టారు. అంతేగాక, బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పులదండ వేసి వూరేగించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషంగాబాద్ జిల్లా సింగోడా గ్రామానికి చెందిన అక్షయ్ మెహ్రా అనే యువకుడు, మేదఖేడా గ్రామానికి చెందిన ఓ వివాహిత ప్రేమించుకున్నారు. విషయం తెలిసి ఆమె భర్త రామ్గోపాల్ ఠాకూర్ ఆమెను ఇంట్లో బంధించాడు. కాగా, ఠాకూర్ వేధింపులు భరించలేక అక్కడ్నుంచి తప్పించుకున్న ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఆమె తర్వాత అక్షయ్ను కలుసుకుంది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా, వారిని పట్టుకున్న గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు.
ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టారు. అంతేగాక, వారి చేత బలవంతంగా మూత్రం కూడా తాగించారు. తీవ్రగాయాలపాలైన బాధితులను పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్లిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి నలుగురు గ్రామస్థులను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.