డంపింగ్ వాహనంలో నిరాశ్రయుల తరలింపు... ఆ అమానవీయ ఘటనే ఆ జంటను మళ్లీ కలిపింది
ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిరాశ్రయులు,అనాథలు,ఏ ఆదరణ లేని వృద్ధులు, యాచకులను స్థానిక నగర పాలక సిబ్బంది డంపింగ్ వాహనంలోకి ఎక్కించి సిటీ బయట వదిలేసిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత అమానవీయ చర్య అని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇదే సంఘటన ఓ వివాహితను తిరిగి తన భర్తతో కలిపింది. నిరాశ్రయులను తరలించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... అందులో తన భర్త కూడా ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో అధికారులను సంప్రదించి ఎట్టకేలకు తన భర్తను తిరిగి ఇంటికి తీసుకొచ్చుకుంది.
పుష్ప సాల్వి(48) అనే ఆ వివాహిత వెల్లడించిన వివరాల ప్రకారం... ఆమె భర్త అనిల్ సాల్వి(50) మతి స్థిమితం సరిగా లేక నెల క్రితం ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఇటీవల ఇండోర్ కార్పోరేషన్ అధికారులు నగరంలోని నిరాశ్రయులను సిటీ అవతలికి తరలించిన విషయం పుష్ప సాల్వికి తెలిసింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను ఆమె కూడా చూసింది.
ఆశ్చర్యంగా అందులో ఆమె తన భర్త అనిల్ సాల్వి కూడా ఉన్నట్లు గుర్తించింది. ఇండోర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల సహాయంతో ఎట్టకేలకు తన భర్త ఆచూకీ తెలుసుకుని అక్కడికి చేరుకుంది. అనిల్ సాల్విని అక్కడినుంచి మెంటల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం ఆమెతో పాటు ఇంటికి తీసుకెళ్లింది. భర్త ఎక్కడికెళ్లాడో తెలియక నెల రోజులుగా దిగులు చెందుతున్న ఆమె ఇప్పుడు కాస్త సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు.
Recommended Video
మరోవైపు ఇండోర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల చర్యపై మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది. ఇప్పటికే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు.నగరాన్ని శుభ్రంగా ఉంచాలంటే... వీరందరినీ బయటకు తరలించాలని ఆదేశించిన అధికారి ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు.