రక్తం వచ్చేలా కొట్టినా..: పోలీస్స్టేషన్లోనే నిప్పంటించుకున్న దంపతులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో భార్యభర్తలిద్దరూ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన ఆ దంపతులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై సీరియస్గా స్పందించిన ఉన్నతాధికారులు.. సదరు పోలీస్ స్టేషన్ ఇంఛార్జీతోపాటు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లోనే..
పీటీఐ కథనం ప్రకారం.. మథురలోని సురిర్ పోలీస్ స్టేషన్ చేరుకున్న 40ఏళ్ల జోగిందర్, ఆయన భార్య చంద్రావతి ఒక్కసారిగా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నారు. ఆ తర్వాత బాధతో కేకలు వేశారు. వెంటనే వచ్చిన పోలీసులు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బట్టలు తెచ్చి వారిపైనా వేశారు.
వేధింపులంటూ ఫిర్యాదు చేస్తే..
అప్పటికే 60శాతం శరీరం కాలిపోయింది. వెంటనే బాధితులను మొదట దగ్గర్లోని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. తమ గ్రామంలో కొందరు పెద్దలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ జంట సజీవ దహనానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
రక్తం వచ్చేలా కొట్టినా..
ఆగస్టు 23న జరిగిన గొడవలో జోగిందర్పై ఆయన గ్రామంలో పెద్ద మనిషిలా చెలామణి అవుతున్న సత్పాల్, ఆయన అనుచరులు దాడి చేశారు. జోగిందర్ తలపై కొట్టడంతో తీవ్రగాయమై, రక్తస్రావమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చర్యలు తీసుకుంటాం..
కాగా, ఆగస్టు 23న బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మథుర సీనియర్ ఎస్పీ శలభ్ మాథూర్ తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారని చెప్పారు. కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై దర్యాప్తు చేస్తున్నామని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ స్పష్టం చేశారు.