రాత్రి పెళ్లి.. ఉదయం విడాకులు..! కారణమేంటంటే...
పిండారీ : బ్యాండ్ బాజా మధ్య వరుడు గుర్రంపై వచ్చాడు. బంధుమిత్రుల సమక్షంలో నిఖా జరిగింది. పెళ్లి కొచ్చిన వారంతా భోజనాలు చేసి ముచ్చట్లలో మునిగిపోయారు. ఇంతలో ఇరు వర్గాల మధ్య గొడవ. మాటా మాటా పెరిగి అమ్మాయి తరఫువారు వరుడి బంధువుల్ని బంధించారు. చివరకు ఎమ్మెల్యే జోక్యంతో వివాదం సద్దుమణిగినా.. రాత్రి జరిగిన పెళ్లి ఉదయం పెటాకులైంది.
ఫేస్ బుక్ ప్రేమ, అత్యాచారం, ఆత్మహత్య, బెంగళూరు యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష !
వధువుకు పాతబట్టలు ఇచ్చారని
జార్ఖండ్లోని పిండారీ గ్రామానికి చెందిన నౌషద్ అన్సారీ కుమార్తెకు ఖుర్షీద్ అన్సారీ కుమారుడు ఆరీఫ్ అన్సారీలో పెళ్లి నిశ్చయమైంది. వధువు తరఫువారు అబ్బాయికి రూ.3లక్షలు కట్నంగా ఇచ్చారు. అన్నీ అనుకున్నట్లుగానే నిఖా పూర్తైంది. ఆ తర్వాత జరగాల్సిన తంతులో భాగంగా వరుడి బంధువులు వధువుకు దుస్తులు ఇచ్చారు. అయితే అవి పాతవి కావడంతో ఆడపెళ్లి వారికి కోపం నషాళానికంటింది. దీనిపై మగపెళ్లివారిని నిలదీశారు.
పెళ్లికొడుకు బంధువుల్ని బంధించి
ఇరు వర్గాల వారి మధ్య మాటా మాటా పెరిగింది. పెళ్లి రద్దు చేసుకుంటామని కానుకల రూపంలో ఇచ్చిన సొమ్ము వెంటనే తిరిగి ఇచ్చేయాలని వరునితో పాటు అతని బంధువులు 150మందిని బంధించారు. గ్రామస్థులు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బాదల్ పత్ర్లేఖ్కు చెప్పడంతో ఆయన రంగంలోకి దిగారు. పెళ్లి జరిగిన చోటకు వచ్చిన ఆయన ఇరు వర్గాలతో మాట్లాడారు. వరుని తరఫువారు తీసుకున్న రూ.3,40,00 నగదును ఆడపెళ్లివారికి తిరిగి ఇప్పించారు. దీంతో వారు మగపెళ్లి వారిని విడిచిపెట్టారు.
రాత్రి పెళ్లి ఉదయం తలాక్
పెళ్లిలో గొడవ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అయితే గ్రామస్తులు సమస్యను తామే పరిష్కరించుకున్నామని చెప్పడంతో వెనుదిరిగారు. ఇదిలా ఉంటే పెళ్లి పెటాకులు కావడంతో రాత్రి భార్యగా స్వీకరించిన యువతికి వరడు ఉదయమే తలాక్ చెప్పాడు. కేవలం వధువుకు పాత దుస్తులు ఇచ్చారన్న కారణంతో పెళ్లి పెటాకులైన విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.