రూ. 13 వేల మొబైల్: ఫ్లిప్ కాట్ కొరియర్ బాయ్ హత్య
బెంగళూరు: కొత్త మొబైల్ మోజులో కొరియర్ బాయ్ ను అతి దారుణంగా హత్య చేసిన జిమ్ సెంటర్ కోచ్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మూడపాళ్యలోని ఎస్ వీజీ నగర్ లో నివాసం ఉంటున్న వరుణ్ అలియాస్ వరుణ్ కుమార్ (22) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
బెంగళూరులోని కామాక్షిపాళ్యలో నివాసం ఉంటున్న నంజుండస్వామి (29) ఫ్లిప్ కాట్ లో కొరియర్ బాయ్ గా పని చేస్తున్నాడు. వరుణ్ కుమార్ గత సంవత్సరం నుంచి సరస్వతి నగర్ లోని అక్షి జిమ్ లో కోచ్ గా ఉద్యోగం చేసేవాడు.
అయితే నెల క్రితం ఉద్యోగం నిలిపివేసిన వరుణ్ 10 రోజుల క్రితం మళ్లీ అక్కడే ఉద్యోగంలో చేరాడు. ఈనెల 8వ తేదిన ఫ్లిప్ కాట్ లో ఎంఐ కంపెనీకి చెందిన రూ. 13 వేల విలువైన మొబైల్ ఫోన్ ను వరణ్ ఆన్ లైన్ లో బుక్ చేశాడు.
డిసెంబర్ 9వ తేదిన మొబైల్ తీసుకువస్తున్నామని, అడ్రస్ చెప్పాలని కొరియర్ బాయ్ నంజుండస్వామి వరుణ్ కు ఫోన్ చేశాడు. జిమ్ సెంటర్ దగ్గరకు రావాలని వరుణ్ చెప్పాడు. వరుణ్ పని చేస్తున్న జిమ్ మూడవ అంతస్తులో ఉంది.
మొదటి అంతస్తులో అలహాబాద్ బ్యాంక్, రెండవ అంతస్తులో సాఫ్ట్ వేర్ కంపెనీ, మూడవ అంతస్తులో అక్షి జిమ్ ఉంది. నంజుండ స్వామి మద్యహ్నాం మొబైల్ ఫోన్ తీసుకు వస్తానని చెప్పాడు.
ఆ సమయంలో వరుణ్ మొబైల్ తీసుకోవడానికి డబ్బులు కావాలని జిమ్ సెంటర్ యజమానిని అడిగాడు. జీతం వచ్చిన తరువాత తీసుకోవాలని వారు చెప్పారు. మద్యాహ్నం మొబైల్ తీసుకుని జిమ్ సెంటర్ లోకి నంజుండ స్వామి వెళ్లారు.
అయితే అప్పటికే బ్యాగ్ లో ఇనుప రాడ్, కత్తి పెట్టుకున్న వరుణ్ నంజుండస్వామి మీద దాడి చేశాడు. తరువాత కిందపడిపోయిన అతనిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని సెల్లార్ లో పడేశాడు.
నంజుండస్వామి దగ్గర ఉన్న కొత్త మొబైల్, అతని జోబులో ఉన్న రూ. 10 వేలు తీసుకున్నాడు. నంజుండస్వామిని హత్య చేసిన సమయంలో రక్తం కింద పడటంతో దాని మీద మట్టి వేశాడు. సాయంత్రం సాటి ఉద్యోగి నిశ్చిత్ అక్కడికి వెళ్లాడు.
ఎందుకు రక్తం కిందపడిందని అని వరుణ్ ను ప్రశ్నించాడు. యోగేష్ అనే ఉద్యోగికి మన యజమాని జీవితం ఇవ్వలేదని, గొడవ జరగడంతో యోగేష్ కు గాయం అయ్యి రక్తం పడిందని చెప్పాడు. డిసెంబర్ 11వ తేదిన దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి పరిశీలించగా సెల్లార్ లో నంజుండస్వామి శవం బయటపడింది. అప్పటికే నంజుండస్వామి కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు బ్యారాయణపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నంజుండస్వామి శవం స్వాధీనం చేసుకున్న సమయంలో జిమ్ సెంటర్ లో వరుణ్ ఉన్నాడు. మొదట తనకు ఏమీ సంబంధం లేదని పోలీసులకు చెప్పాడు. అయితే నంజుండస్వామి మొబైల్ కు వరుణ్ ఫోన్ నెంబర్ నుంచి చివరి ఫోన్ కాల్ వెళ్లిందని గుర్తించి అతనిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.