రేప్ కేసు: బిఎస్పీ మాజీ ఎంపి ధనంజయ్ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: అత్యాచారం, బెదరింపులకు పాల్పడిన నేరారోపణలు ఎదుర్కొంటున్న బహుజన సమాజ్వాది పార్టీ మాజీ ఎంపి ధనంజయ్ సింగ్ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఓ మహిళ తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడంతో ధనంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వాదనలు విన్న కోర్టు అతడ్ని నిర్దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది.
కేసు విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి సరితా బీర్బల్ ఎదుట తనపై ధనంజయ్ సింగ్ అత్యాచారానికి పాల్పడలేదని బాధితురాలిగా పేర్కొన్న మహిళ తెలపడంతో.. సింగ్ను న్యాయమూర్తి నిర్దోషిగా ప్రకటించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఈ కేసును మూసివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఇదే ఆఖరి తీర్పు అని తెలిపింది.
బాధితురాలిగా పేర్కొన్న ఆ మహిళ ఓ రైల్వే ఉద్యోగి. తనపై నాలుగేళ్లపాటు తరచుగా ధనంజయ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఇంతకుముందు పోలీసులు, కోర్టు ముందు తెలిపింది. దీంతో పోలీసులు సింగ్ను అరెస్ట్ చేశారు. ఎస్పీఎం త్రిపాఠిని సింగ్ అతని తరపు న్యాయవాది నియమించుకుని, అతని ద్వారా బెయిల్ పొందారు.
కేసు వివరాల్లోకి వివరాలిలా ఉన్నాయి. 2005 జులై -2009 మార్చి మధ్య కాలంలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ధనంజయ్పై పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. తుపాకీతో బెదిరింపులకు పాల్పడి బాధితురాలిపై సింగ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. దీంతో సింగ్ నేరాభియోగాలు ఎదుర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా సింగ్, అతని భార్య జాగృతి సింగ్లు కలిసి వారి ఇంట్లోని పని మనిషిని హత్యా చేశారనే అభియోగాలు కూడా వారిపై నమోదయ్యాయి. గత నవంబర్ నెలలో ఈ కేసులో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బాధితురాలు తన భర్త ద్వారానే 2005 ఫిబ్రవరిలో సింగ్ను కలిసిందని పోలీసులు తెలిపారు. ఆమె అతడ్ని తన బావగా భావించినట్లు చెప్పారు.
అయితే సింగ్తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో బాధితురాలితో ఆమె భర్త తరచూ ఘర్షణకు దిగేవాడు. విడాకుల నోటీసు కూడా ఆమెకు పంపాడని పోలీసులు చెప్పారు. ఛార్జీషీటులో ముగ్గురు డాక్టర్లతోపాటు 13మందిని సాక్షులుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సింగ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.