మథురలో శ్రీకృష్ణ జన్మభూమి అనుకొని ఉన్న మసీదు తొలగించండి, పిటిషన్ స్వీకరణ
అయోధ్య భూ వివాదం సమసిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మథురలో మసీదు, వారణాసిలో మసీదును తొలగించాలని పిటిషన్లు దాఖల అవుతున్నాయి. అయితే శుక్రవారం మథురలో శ్రీ కృష్ణ జన్మభూమి అనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. నవంబర్-18న తదుపరి వాదనలు వింటామని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు హక్కుదారులు, షహీ ఇద్గా మసీదు ట్రస్ట్, సున్నీ వక్ఫ్ బోర్డ్కు కోర్టు నోటీసులు జారీచేసింది.
కృష్ణ జన్మభూమి అనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ అక్టోబర్లో మథుర సివిల్ కోర్టు కొట్టివేసింది. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించి మొత్తం భూమిని అప్పగించాలని 'భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్' తరపున న్యాయవాదులు హరిశంకర్, విష్ణు జైన్ మధుర కోర్టులో సెప్టెంర్ 25వ తేదీన పిటిషన్ వేశారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహి ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూమి ఒప్పందాన్ని ఆమోదిస్తూ 1968లో మధుర కోర్టు ఇచ్చిన రూలింగ్ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సేనలు శ్రీకృష్ణుడి జన్మస్థలం అని విశ్వసిస్తోన్న స్థలంలోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను అప్పుడు సివిల్ కోర్టు కొట్టివేసింది. పిటిషన్ విచారణకు అనుమతించకపోవడానికి కారణం ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం-1991 ప్రకారం నిషేధం ఉండటమేనని కోర్టు చెప్పింది.
Recommended Video
2019 నవంబర్లో అయోధ్యలోని దశాబ్దాల రామ జన్మభూమి-మసీదు వివాదంలో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. ఇక అప్పటినుంచి మథురలోని కృష్షజన్మభూమి, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాలను అనుకొన్ని ఉన్న మసీదులను తొలగించాలని పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.