సీజేపై కమిటీ రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయరు..? ఇందిరా జైసింగ్ కేసులో ఏంజరిగింది..?
ఢిల్లీ: సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదంటూ అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ విచారణకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయబోమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ఇందుకు 2003లో ఇందిరాజైసింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు ,ఇతరులు కేసులో ఇచ్చిన తీర్పును పొందుపర్చింది. ఆ తీర్పు ప్రకారం అంతర్గత విచారణ ప్రక్రియలో భాగంగా ఏర్పడిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాల్సిన పనిలేదని పేర్కొంది.
ఇందిరా జైసింగ్ ఎందుకు బహిర్గతం చేయరు..?: ఇందిరా జైసింగ్
సుప్రీంకోర్టు చూపించిన నాటి కేసుపై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విటర్ వేదికగా స్పందించారు. " ఇదొక కుంభకోణం.. అపకీర్తి తెచ్చే కార్యక్రమం. ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కేసు కూడా లైంగిక వేధింపుల కేసే. ఇది ముందస్తు ఆర్టీఐ కేసు, చట్ట విరుద్ధమైనది. ప్రజాప్రయోజనం కింద విచారణ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా" అంటూ ఇందిరా జైసింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుత కేసులో చూపిన 2003 ఆదేశాలు నాడు సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు జస్టిస్ ఎస్ రాజేంద్రబాబు, జస్టిస్ జీపీ మాథుర్లు తీర్పు ఇచ్చారు. అయితే ఆ నాడు ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలంటూ ఇందిరా జైసింగ్ పిల్ దాఖలు చేశారు. ఆ సమయంలో పిల్ను విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెల్లడించింది.
చీఫ్ జస్టిస్కు సమాచారం ఇచ్చేందుకే..
సుప్రీం కోర్టు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్లపై ఆరోపణలు వచ్చినప్పుడు అంతర్గత విచారణ కమిటీతో విచారణ చేయిస్తామని అయితే ఇది కేవలం చీఫ్ జస్టిస్కు సమాచారం ఇచ్చేందుకు లేదా ఆయన్ను తృప్తి పరిచేందుకు మాత్రమే అని పేర్కొంది. అంతే తప్ప విచారణ తీరుతెన్నులపై కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అదే సమయంలో బహిర్గతం చేస్తే సుప్రీంకోర్టు వ్యవస్థపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని భావించింది.
ఒక్కసారి విచారణ కమిటీ నివేదిక సమర్పించాకా... అందులోని అంశాలను బహిర్గతం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం మంచిది కాదని చెప్పింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే జడ్జీలతో ఎంక్వైరీకి చీఫ్ జస్టిస్ ఆదేశిస్తారని స్పష్టం చేసింది. ఇక రిపోర్టును పూర్తిగా గోప్యతతో ఉంచుతామని వివరించింది నాటి సుప్రీంకోర్టు బెంచ్. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికతో చీఫ్ జస్టిస్ సంతృప్తి చెందితే ఎలాంటి చర్యలు ఉండవని అక్కడితో కేసు ముగుస్తుందని వివరించింది. ఒకవేళ విచారణ కమిటీనే తదుపరి చర్యలకు ఆదేశిస్తే అది చీఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.
రిపోర్టును బహిర్గతం చేయాలంటూ పిల్ దాఖలు
ఫిబ్రవరి 2, 2003లో ఇందిరా జైసింగ్ కేసులో నాటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీకే టక్కర్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిల్ జేఎల్ గుప్తా, నాటి ఒరిస్సా హైకోర్టు జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్లతో కూడిన అత్యున్నత అంతర్గత త్రిసభ్య కమిటీని నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జీబీ పట్నాయక్ నియమించారు. విచారణ చేసిన కమిటీ నివేదికను అప్పటి సీజేఐ వీఎన్ ఖరేకు సమర్పించింది. అయితే కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలంటూ జైసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రజాస్వామ్యంలో పౌరులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ సమాచార హక్కుకింద అన్నీ బహిర్గతం చేయలేమని వ్యాఖ్యానించింది. ఇక న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చిన సమయంలో అంతర్గత విచారణ కమిటీ ఇచ్చే నివేదిక కేవలం చీఫ్ జస్టిస్కు సమాచారం తెలిపేందుకు మాత్రమే అని పేర్కొంది. అంతే తప్ప ఇతర వ్యక్తులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.