మరింత ట్రబుల్ లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్: వీడని ఈడీ కష్టాలు: కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. ఆయన కస్టడీని ఢిల్లీ కోర్టు మరో అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ వరకు ఆయనను కస్టడీలోకి తీసుకోవచ్చని రోజ్ అవెన్యూ న్యాయస్థానం.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అనుమతి ఇచ్చింది. దీనితో- ఆయనను మరోసారి తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తుగ్లకాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 600 కోట్ల రూపాయల మేర అక్రమంగా ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ నెల 3వ తేదీన డీకే శివకుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బురఖా ధరించినందుకు కళాశాల నుంచి గెంటివేత: అసాంఘిక శక్తులకు అవకాశం ఇస్తోందట!
ఆయనను ఢిల్లీలో విచారిస్తున్నారు అధికారులు. ఈ కేసు విచారణలో భాగంగా.. ఆయన కుమార్తె ఐశ్వర్యను సైతం అదుపులోకి తీసుకున్నారు. సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా ఆమె నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం నాటితో డీకే శివకుమార్ తొమ్మిది రోజుల కస్టడీ ముగియడంతో ఈ మధ్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను రోజ్ అవెన్యూ న్యాయస్థానం సమక్షానికి హాజరు పరిచారు. కస్టడీని పొడిగించాలని కోరారు.
ఇప్పటిదాకా నిర్వహించిన విచారణ సందర్భంగా కొన్ని కీలక ప్రశ్నలకు డీకే శివకుమార్ సమాధానాలను ఇవ్వలేదని న్యాయమూర్తులకు ఈడీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. విచారణకు సహకరించట్లేదని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, తొమ్మిది రోజులు కస్టడీలో నిందితుడి నుంచి రాబట్టుకోలేని సమాధానాలను ఈ అయిదు రోజుల్లో రాబట్టుకోగలరా? అని ప్రశ్నించారు.ద దీనికి న్యాయవాది బదులిస్తూ- తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, విచారణకు సహకరించేలా నిందితుడిని ఆదేశించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై డీకే శివకుమార్ తరఫు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా న్యాయమూర్తులు ఆలకించారు. అనంతరం డీకే శివకుమార్ కస్టడీని మరో అయిదు రోజుల పాటు అంటే ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.