ట్రబుల్ షూటర్కు ట్రబుల్స్: డీకే శివకుమార్ కస్టడీని మరో ఐదురోజులు పొడిగింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కస్టడీ ముగియడంతో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టింది. డీకే శివకుమార్కు సెప్టెంబర్ 17వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈడీ శివకుమార్ను అరెస్టు చేసింది. 9 రోజుల పాటు విచారణ చేసిన ఈడీ కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే ముందుగా శివకుమార్ ఆరోగ్య పరిస్థితి బాగుందో లేదో తెలుసుకున్నాకే విచారణలో భాగంగా ప్రశ్నలు అడగాలని ఈడీకి కోర్టు సూచించింది.
చిదంబరం కేసును విచారణ చేసిన ప్రత్యేక జడ్జి డీకే శివకుమార్ కేసులో వాదనలు విన్నారు. కస్టడీని ఐదురోజుల పాటు పొడగించాలని ఈడీ కోర్టును కోరింది. విచారణకు శివకుమార్ సహకరించడం లేదని ఈడీ వాదనలు వినిపించింది. కస్టడీ ఇవ్వకుంటే ఆయన సాక్షాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని చెప్పింది. విచారణ సమయంలో పొంతన లేని సమాధానాలను శివకుమార్ ఇస్తున్నారని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. చాలా మటుకు ఆస్తులు బినామీల పేర్లపై ఉన్నట్లు తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది.
డీకే శివకుమార్కు సంబంధిచి అక్కమ సంపాదన రూ. 200 కోట్లు గుర్తించామని చెప్పిన ఈడీ... మరో రూ.800 కోట్లు బినామీల పేర్లపై ఉన్నట్లు గుర్తించామని ఈడీ కోర్టుకు వెల్లడించింది. కేసుకు సంబంధించి తాము స్వాధీనం చేసుకున్న పత్రాలను ఒకసారి పరిశీలించి ఆ పై నిర్ణయం తెలపాలని ఈడీ తరపున వాదించిన అడిషనల్ సాల్సిటర్ జనరల్ కేఎం నటరాజన్ కోర్టును కోరారు. అయితే ఐదురోజుల కస్టడీలో కూడా తాను నోరు విప్పరని అలాంటప్పుడు కస్టడీ ఎందుకని న్యాయమూర్తి ఈడీని ప్రశ్నించారు. కేసుకు సంబంధించి ఇతరుల నుంచి కొంత కీలక సమాచారం సేకరించామని... ఆ సమాచారం ద్వారా శివకుమార్ దగ్గర నుంచి సమాధానం రాబడుతామని చెప్పారు.