కనిమొళి అరెస్టుకు వారంట్: క్షమాపణలతో రద్దు
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూతురు కనిమొళిపై ప్రత్యేక కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. కోర్టుకు ఆమె హాజరు కాకపోవడంతో కోర్టు ఆ వారంట్ జారీ చేసింది. అయితే, ఆమె తరఫు న్యాయవాది హాజరై క్షమాపణ చెప్పడంతో కోర్టు వారంట్ను రద్దు చేసింది.
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సోమవారంనాడు కోర్టు డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళిపై అరెస్టు వారంట్ జారీ చేసింది. 2జి స్పెక్ట్రమ్ తుది విచారణకు డిసెంబర్ 19వ తేదీని కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో కనిమొళితో పాటు మాజీ టెలికమ్ మంత్రి ఎ రాజా, మరో 15 మంది నిందితులుగా ఉన్నారు.
సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపి సైనీ సోమవారంనాడు విచారణకు తీసుకున్నారు. అయితే, సిబిఐ, నిందితుల తరఫు న్యాయవాదులు మరింత సమయం కావాలని కోరడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. తన వాదనలను కొనసాగించడానికి తనకు మరింత సమయం కావాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోయర్ కోర్టును కోరారు.
మరింత మంది సాక్షులను సిబిఐ విచారిస్తున్న స్థితిలో తుది విచారణను ఎలా చేపడుతారంటూ కేసులో నిందితుడైన స్వాన్ టెలికమ్ ప్రమోటర్ షాహిద్ బాల్వా తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రశ్నించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి 30,984 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపించింది. అయితే, ఆ స్పెక్ట్రమ్ లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.