బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. రకుల్ పిటీషన్ పై కేంద్రానికి, మీడియా నియంత్రణా సంస్థలకు కోర్టు నోటీసులు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో మీడియా తన పేరును ప్రస్తావిస్తుందని , అలా ప్రస్తావించకూడదని రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే .రియా చక్రవర్తితో రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి సంబంధాలు ఉండటం ,రియా చక్రవర్తి ఫోన్ లో వాట్సప్ చాట్ లో రకుల్ డ్రగ్స్ గురించి చాట్ చెయ్యటం వంటి విషయాలు వెలుగులోకి రావటంతో ఆమెకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది . ఈ కేసులో రకుల్ ఎన్సీబీ ముందు విచారణకు సైతం హాజరయ్యింది.
మీడియాపై రకుల్ పిటీషన్ ... తనపై వార్తలు రాయొద్దని కోరిన రకుల్
డ్రగ్స్ కేసులో తనపై వార్తలు రాయకుండా, ప్రసారం చేయకుండా మీడియా సంస్థలకు ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించింది రకుల్ ప్రీత్ సింగ్ . ఆమె పిటిషన్ పై నేడు విచారణ కొనసాగింది. మీడియాలో తనపై వార్తలు వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ పూర్తి చేసి, నివేదిక వెలువడే వరకూ తనపై వార్తలు రాయకుండా చూడాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.
కేంద్ర ప్రభుత్వానికి, మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ
ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులలోరకుల్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి కి సంబంధించి వారు ఏం చేశారంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది . కేంద్ర ప్రభుత్వం , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ నవీన్ చావ్లా రకుల్ ప్రీత్ సింగ్ పిటిషన్ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల సూచిస్తూ స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ కు ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ 15 లోగా నివేదికలు దాఖలు చెయ్యాలని ఆదేశం
అక్టోబర్ 15వ తేదీన తుది విచారణ జరుగుతుందని వారు అప్పటిలోగా తమ నివేదికను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.ప్రస్తుతం మీడియా వార్తల నిలుపుదలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన రకుల్ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు కేంద్రాన్ని , మీడియా నియంత్రణా సంస్థల వివరణ కోరింది . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సందర్భంగా, రకుల్ తరఫున తన వాదన వినిపించిన న్యాయవాది అమన్ హింగోరానీ ఈ కేసు విషయంలో రకుల్ పై తప్పుడు వార్తలను ప్రచురించటం ఆమెను మానసికంగా కుంగదీస్తుందని చెప్పారు. మీడియాను కట్టడి చెయ్యాలని కోరారు.