అక్కడ డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా?
రోడ్డు భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడేదిలేదని ఉత్తరాఖండ్ హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదని అభిప్రాయపడ్డ ధర్మాసనం... వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడితే ఆఫోన్ను పోలీసులు తీసుకుని కనీసం 24 గంటల పాటు సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అయితే మొబైల్ ఫోన్ సీజ్ చేశాక వారికి ఒక రశీదు ఇవ్వాలని సూచించింది.
గత నెలలో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చెబుతూ... వాహనదారులు ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా పోతున్నాయని హైకోర్టు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చట్టం తీసుకొచ్చే వరకు ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తారో వారి నుంచి రూ. 5వేలు వసూలు చేయాల్సిందిగా రవాణాశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రోడ్డు భద్రతపై జస్టిస్ రాజీవ్ శర్మ మరిన్ని సూచనలు చేశారు. నెలకోసారి రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించాలని... అవసరమైన చోట్ల వెంటనే మరమత్తులు చేయాలని జస్టిస్ రాజీవ్ శర్మ సూచించారు. దీని ద్వారా ప్రమాదాలను కొంతవరకు తగ్గించొచ్చు అని అభిప్రాయపడ్డారు.
పౌరిగర్వాల్లోని ధుమకోట్ ప్రాంతంలో బస్సు లోయలో పడి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని సీరియస్గా తీసుకున్న న్యాయస్థానం రవాణాశాఖ కార్యదర్శికి రోడ్డు భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలంటూ సమన్లు జారీ చేసింది.
రవాణాశాఖ కార్యదర్శి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని న్యాయస్థానం రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్లలో మొత్తం 73 ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా న్యాయస్థానం సూచించింది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు తక్షణమే ఒక 100 బ్రీత్ అనలైజర్ పరికరాలు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు గుర్తింపబడ్డ ప్రమాదకరమైన మలుపుల దగ్గర పారాపెట్ గోడలు,క్రాష్ బారియర్స్, సైన్ బోర్డులను విధిగా పెట్టాలని కోర్టు సూచించింది.
ఓవర్లోడుతో వెళ్లే స్కూలు బస్సులను తనిఖీ చేసేందుకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ఓ అధికారిని నియమించాలని ఆదేశించింది. ప్రైవేట్ వాహనాలపై ఉన్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు ఇతరత్రా చెత్త చెదారాన్ని ఒకవారంలో తొలగించాల్సదింగా ఆదేశించింది. గవర్నమెంట్ వెహికల్, జర్నలిస్టు, ఆర్మీ, పోలీసులు వంటి రాతలు వాహనాలపై కనిపించకూడదని కోర్టు ఆర్డర్ వేసింది.