అదేం కుదరదు..! విచారణకు రావాల్సిందే..! సాధ్వీకి ఎన్ఐఏ కోర్టు షాక్..
ముంబై : మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు షాకిచ్చింది. వారానికోసారి కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. జూన్ 3 నుంచి 7 మధ్యకాలంలో పార్లమెంటుకు వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సాధ్వీ అభ్యర్థించారు. అయితే ఎన్ఐఏ కోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. సాధ్వీ తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.
మాలేగావ్ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు విచారిస్తోంది. మే 21న జరిగిన విచారణలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సుధాకర్ చతుర్వేదిలకు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రగ్యాసింగ్ ఠాకూర్తో పాటు మరో ఇద్దరు విచారణ నుంచి మినహాయింపు కోరుతూ పిటీషన్లు దాఖలు చేశారు.
వీడియో వైరల్ : రెచ్చిపోతున్న ప్రజాప్రతినిధులు.. మహిళను కాలుతో తన్నిన ఎమ్మెల్యే
2008 సెప్టెంబర్ 29న జరిగిన మాలేగావ్ పేలుళ్లలో ఏడుగురు చనిపోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. కేసు విచారణ చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. అదే ఏడాది అక్టోబర్ 24న స్వామి అసిమానంద్, కల్నల్ పురోహిత్, సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ను అరెస్ట్ చేసింది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పింది. అనంతరం కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. దాదాపు తొమ్మిదేళ్లు జైలులో గడిపిన అనంతరం 2017లో సాధ్వీ ప్రగ్యాసింగ్ బెయిల్పై బయటకు వచ్చారు. 2018 అక్టోబర్ 30న సాధ్వీ సహా ఏడుగురు నిందితులపై ఉగ్ర కుట్ర, హత్య ఆరోపణలపై విచారించాలని కోర్టు నిర్ణయించింది.