పెప్సీ, కోకాకోలాలు నీరు వాడుకోవచ్చు: తీర్పుపై తమిళుల నిరసన
శీతల పానీయాలైన పెప్సీ, కోక్లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. వాటికి నీటి సరఫరా నిలిపివేయాలని వేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ కొట్టేసింది.
చెన్నై: శీతల పానీయాలైన పెప్సీ, కోక్లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. వాటికి నీటి సరఫరా నిలిపివేయాలని వేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ కొట్టేసింది.
తమిరబరని నది నుంచి పెప్సీ, కోక్ కంపెనీలు నీటిని వాడుకోవద్దని పిటిషన్ దాఖలు కాగా.. కోర్టు దానిని తిరస్కరించింది. గత నవంబర్ నెలలో కోర్టు ఈ రెండు కంపెనీలు తమిరబరని నది నుంచి నీరు తీసుకోవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
అయితే తాజా పిటిషన్ను మాత్రం కోర్టు కొట్టేసింది. తిరునల్వేలి జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం సెక్రటరీ డీఏ ప్రభాకర్ ఈ రెండు కంపెనీలకు తమిరబరని నీటి సరఫరాను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ తీర్పు పైన పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నదిలో మోకాలి లోతు వరకు దిగి నిరసన తెలుపుతున్నారు. తమిరభరని నది నుంచి నీటిని తీసుకోవచ్చన్న హైకోర్టు ఉత్తర్వులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీక్ష నిర్వహించారు.
సాగు నీటి కొరత వేధిస్తున్నప్పటికీ ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.