కులాల బదిలీ: యోగి ఆదిత్యనాథ్కు హైకోర్టులో చుక్కెదురు
లక్నో: 17 ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతులను షెడ్యూల్డ్ క్యాస్ట్స్లో చేర్చాలని నిర్ణయించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు.
గోరఖ్ ప్రసాద్ అనే కార్యకర్త వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కశ్యప్, రాజ్భర్, ధివర్, బింద్, కుమ్హర్, కహర్, కెవత్, నిషద్, భవర్, మల్లహ్, ప్రజాపతి, ధిమర్, బథమ్, తుర్హ, గోడియా, మాంఝీ, మచువా లాంటి ఓబీసీ వర్గాలను షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేరుస్తున్నట్లు యూపీ బీజేపీ ప్రభుత్వం జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజు నుంచే అమలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రతిపక్షాలతోపాటు కొందరు సొంత పార్టీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, 2022లో జరగనున్న ఎన్నికల్లో గెలిచే ఉద్దేశంతోనే యోగి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు ప్రతిపక్షాల నేతలు.
కాగా, యోగి ప్రభుత్వం అమలు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధమని అతని సొంత పార్టీ బీజేపీ నేత, కేంద్రమంత్రి అశోక్ గెహ్లట్ పార్లమెంటులోనే వ్యతిరేకించారు. ఇది సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. అయితే, యోగి కంటే ముందే 2005లో ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం 11 వెనుకబడిన కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.