సునంద పుష్కర్ మృతి కేసు: హాజరుకావాలంటూ శశిథరూర్కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్కు ఆయన సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పాటియాల కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో దాఖలు చేయబడిన ఛార్జీషీటును కోర్టు పరిశీలించింది. శశిథరూర్ను విచారించేందుకు సరైన ఆధారాలున్నాయని భావిస్తున్నామని కోర్టు తెలిపింది. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశిథరూర్ను ప్రశ్నించే అవకాశం ఉంది.
సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా శశి థరూర్పై తగినన్ని ఆధారాలున్నాయని, ఆయనను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయాల్సిందిగా మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు.
భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని 3000 పేజీల చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాగా, జనవరి 17, 2014లో ఢిల్లీలోని లీలాప్యాలెస్లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.